YCP MLAలు టచ్ లో ఉన్నారు: చంద్రబాబు
ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ముందస్తుకు తాము సిద్ధంగా లేమని జగన్ భావిస్తే అది పగటికలే అవుతుందని, జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, ఆ పార్టీలో వారంతా బానిసల్లా బతుకుతున్నారన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దేశ చరిత్రలోనే పెద్ద సస్పెన్స్ థ్రిలర్ అని, ఫిక్షన్ కథలు రాసే వారు కూడా ఇలాంటివి రాయలేరన్నారు. దేశంలో ఇన్ని మలుపులు తిరిగిన కేసు మరొకటి లేదని, ఈ కేసు పోతే.. వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. జగన్ పేదల ప్రతినిధి కాదు అని విమర్శించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు శాశ్వత చికిత్స చేస్తారని, ఎన్నికల్లో తన వైఫల్యం ఉందన్న బొత్స రాజీనామా చేయొచ్చుగా అన్నారు. ఏప్రిల్ ఫూల్ అనేపదం జగన్ కు సరిగా సరిపోతుందని ఎద్దేవా చేశారు. ప్రజల్ని ఎల్లకాలం ఫూల్స్ చేయొచ్చన్న భ్రమలో ఉండటం సాధ్యం కాదని, ప్రజలంతా జగన్ ను ఫూల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర విధ్వంసం కోసమే పుట్టినట్లుగా ఉన్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చెడు ఆలోచనలు అంచనా వేయడం కష్టమని, అతని భవిష్యత్తు ఏమిటనేది ప్రజలు అంచనా వేస్తున్నారన్నారు.
ఇప్పుడు ఎదురుదాడి తప్ప మరొకటి లేదని, 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యమన్నారు. తమకున్న 23 మంది ఎమ్మెల్యేల బలంతోనే ఎమ్మెల్సీని గెలిపించుకున్నామని, తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకొని తిరిగి టీడీపీపై నింద వేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలని జగన్ అసెంబ్లీలో చెప్పినట్లు గుర్తుచేశారు. ఎమ్మెల్యే కోటాలో తెలుగుదేశానికి రావాల్సిన ఒక సీటు కోసం పోటీ చేయడం అనైతికమనడం బుద్ధిలేని తనం కాక మరేంటని బాబు ఆక్షేపించారు












Click it and Unblock the Notifications