తమిళనాడులో తెలుగు భాష కోసం మహాధర్నా: లక్ష్మీపార్వతి, సినీ నటులు మద్దతు
హైదరాబాద్: తమిళనాడులో మాతృభాషను కాపాడుకుందామనే నినాదంతో ఆ రాష్ట్రంలోని తెలుగువారు ఢిల్లీలో నిరనస కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 9వ తేదీన మహాధర్నాకు దిగుతున్నారు. తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో జరిగే ఈ ధర్నా కార్యక్రమం పోస్టర్ను మంగళవారంనాడు ఆవిష్కరించారు.
పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతితో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాంగ్రెసు తెలంగాణ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, నవదీప్, అశోక్ కుమార్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగుదేశం శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు కూడా పాల్గొన్నారు.
మహాధర్నా తర్వాత పార్లమెంటు వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి తమిళనాడు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించారు. నిర్బంధ తమిళ భాష చట్టాన్ని రద్దు చేయాలని తాము మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నామని ఆయన చెప్పారు.
తెలుగు భాషను చదువుకునే అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాసినా తమిళనాడు ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆయన అన్నారు.
భాషాపరమైన అల్పసంఖ్యాకుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తమిళనాడు ప్రభుత్వంపై ఉందని అంటూ నిర్బంధ తమిళ భాషా చట్టాన్ని తెచ్చి భాషా అల్పసంఖ్యాకులైన తెలుగు, కన్నడం,, మలయాళం, ఉర్దూ భాషలకు చెందిన ప్రజల హక్కులను తమిళనాడు ప్రభుత్వం హరిస్తోందని ఆయన విమర్శించారు.
తమ ఉద్యమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. తమ ఉద్యమానికి సంబంధించిన వార్తలు తమిళనాడు పత్రికల్లో రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుకు తీర్పు వార్తలు కూడా మీడియాలో రాలేదని ఆయన అన్నారు. తమిళనాడు ప్రతిపక్ష పార్టీలు కూడా తెలుగు భాష విషయంలో తమకు సహకరించడం లేదని ఆయన అన్నారు.
తమిళనాడులో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని, 2006లో తమిళనాడు ప్రభుత్వం తెచ్చిన నిర్బంధ తమిళ భాషా బోధన చట్టాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. భాషా అల్పసంఖ్యాకులకు వారి భాషలను ప్రథమ పాఠ్యాంశంగా చదువుకునే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.