ఆఖరి పోరు ఢిల్లీలోనే: లగడపాటి, మౌనదీక్ష: ఏరాసు
శ్రీకాకుళం/ హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమ ఆఖరి పోరాటం ఇక ఢిల్లీలోనే అని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. విభజనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 21వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి పోరాడాలని ఆయన శ్రీకాకుళంలో శుక్రవారం పిలుపునిచ్చారు. విభజన బిల్లు పార్లమెంటులో ఓడినా, గెలిచినా తమదే బాధ్యత అని ఆయన అన్నారు.
తాము పట్టుకునేది తోకలు కాదని, కొమ్ములు పట్టుకుంటామని ఆయన చెప్పారు. సమైక్య ఉద్యమం పార్టీల్లో, నాయకుల్లో మార్పు తెచ్చిందని, ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ఆయన అన్నారు. ఇక్కడ ఉద్యమిస్తే ఢిల్లీలో వేడి పుడుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర సమైక్యత తర్వాత తమకు పార్టీ అని ఆయన అన్నారు. ఇది ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ అని, మళ్లీ వచ్చే అవకాశం లేదని ఆయన అన్నారు. చలో ఢిల్లీకి అనుగుణంగా ఫిబ్రవరి 9వ తేదీన సమైక్యాంధ్ర రన్ ఉంటుందని ఆయన చెప్పారు.

సమైక్యాంధ్ర కోసం తాము ఫిబ్రవరి 3వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నామని సీమాంధ్రకు చెందిన న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి చెప్పారు. ఈ విషయంపై అన్ని పార్టీలతో మాట్లాడుతున్నామని, నాయకత్వం వహించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరుతున్నామని ఆయన శుక్రవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో చెప్పారు. మౌనదీక్ష చేద్దామని చెప్పామని ఆయన అన్నారు.
ఫిబ్రవరి 3న ఢిల్లీ ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సీమాంధ్ర నేతలు పాదయాత్రను నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర సాగే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. విభజన ప్రక్రియను ఆపడంతో పాటు, టి బిల్లును పార్లమెంటులో పెట్టొదని రాష్ట్రపతిని కలిసి వివరించాలనే యోచనలో సీమాంధ్ర నేతలు ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications