కొట్లాడండి: కెసిఆర్-బాబులపై తొలిసారి కిరణ్ రెడ్డి, చాలా మాట్లాడాలి.. టైముంది
రాజమండ్రి: రాష్ట్ర విభజన అనంతరం.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారి ప్రస్తుత తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాల పాలన పైన పెదవి విప్పారు. కృష్ణా నీటి కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు (చంద్రబాబు, కెసిఆర్) ఢిల్లీలో పోరాడాలని సూచించారు.
అలాగే, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రజలకు చెప్పాలన్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ విద్యా సంస్థల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు రాజమండ్రిలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్లే నీటి సమస్య ఏర్పడిందన్నారు. విభజన వల్ల నష్టం జరుగుతుందని తాను ముందే చెప్పానన్నారు. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల్లో తాగు నీటికే కాకుండా సాగు నీటికి కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితులు లేకపోలేదన్నారు.
కరవు తరహా పరిస్థితి ఎదురుకానుందని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసికట్టుగా ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో పోరాడితేనే, ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశాలున్నాయన్నారు.
అమరావతిపై జరుగుతున్న అన్ని విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. చాలా విషయాలు మాట్లాడాలని ఉందని, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలపై నోరు విప్పుతానని చెప్పారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలను అనేక సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. కాబట్టి ఇద్దరు ఢిల్లీలో పోరాడాలన్నారు.
ఇరువురు సీఎంలు తాము ఇచ్చిన రుణమాఫీ వంటి హామీలను నిలబెట్టుకోవాలన్నారు. సమైక్య రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతివ్వడంతో అవి వివిధ దశల్లో ఉన్నాయని, వాటికి సంబంధించి ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించకపోవడం దారుణమన్నారు.
అవినీతి జరిగిందని అనుమానం వస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలే తప్ప పేదలకు చెల్లించాల్సిన మొత్తం ఆపడం సరికాదన్నారు. రైతులకు రుణభారం పెరుగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, బంగారుతల్లి పథకాలను చట్టం చేసినా వాటి ప్రస్తావన లేకపోవడం విస్మయం కలిగిస్తోందన్నారు.
రెండు రాష్ట్రాల్లో తాగు, సాగు జలాల సమస్య మరింత పెరిగే అవకాశముందన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పందించేందుకు ఇంకా సమయం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి విషయంలో తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియాలన్నారు.