రామ్గోపాల్వర్మను మానసిక వైద్యుడికి చూపించాలి!!
తన వ్యాఖ్యలతో తరుచుగా సంచలనాలు సృష్టించే రామ్గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై రామ్గోపాల్వర్మ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థినిపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ఆమెను కించపరిచేలా ఉన్నాయని, ఆయన మానసిక స్థితి బాగోలేదని, పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
ఆదివాసీ మహిళ మొట్టమొదటిసారి ఈ దేశానికి రాష్ట్రపతి అవుతున్నారని, ఇటువంటి సందర్భంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై పోలీసుశాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యంగ్యంగా ద్రౌపదిముర్ము పేరును ఉపయోగించి ఆర్జీవీ తన పరిధికి మించి వ్యవహరించారని సోము మండిపడ్డారు.ద్రౌపది ముర్ము అధ్యక్షురాలైతే పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు? అంటూ ఒక వివాదాస్పద వ్యాఖ్యను ట్వీట్ చేశారు. వర్మను మానసిక వైద్యుడికి చూపించాలని, ఈదేశంలో మాట్లాడే హక్కు అందరికీ ఉందని, కానీ వర్మ తన పరిధి దాటి వ్యవహరించారన్నారు.
దర్శకుడు రామ్గోపాల్వర్మ తరుచుగా చేసే ట్వీట్లు సంచలనాలకు కారణమవుతుంటాయి. ఇది ఒక ప్రచార గిమ్మిక్కు అంటూ అందరూ కొట్టేస్తుంటారు. తాజాగా కొండా సినిమా విడుదలైందని, ఆ సినిమాకు ప్రచారం కోసం ఈ ట్వీట్ను ఉపయోగించుకున్నారంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రచార గిమ్మిక్కులు చేయడంలో వర్మను మించినవారు లేరని, ఆయన్ను బాయ్కాట్ చేసిన మీడియా కూడా చివరకు ఆయన చుట్టూ తిరిగేలా చేయడంలో దిట్ట అని మరికొందరు అంటున్నారు.