అమరావతిపై చంద్రబాబు అవినీతిని బయటపెడతాం... ఆర్ధిక మంత్రి
ఏపీ రాజధానిపై చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతున్నారని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు చెబుతున్న డ్రీమ్ క్యాపిటల్ ఎక్కడ నిర్మించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాత్కలిక నిర్మాణాలు చేపట్టామని చెప్పిన చంద్రబాబు మహిష్మతి నగరం కోసం సలహాలు కూడ తీసుకున్నారని ఎద్దెవా చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో పర్యటించిన సంధర్బంగా రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన విమర్శలను ఆర్ధిక మంత్రి బుగ్గన తీవ్రంగా ఖండించారు. రాజధాని నిర్మాణాలు అనేవి రాచరిక వ్యవస్థలో ఉండేవని ప్రస్తుతం అభివృద్ది అంతా వికేద్రికరణ జరుగుతుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచమంతా వికేంద్రీకరణ వైపు అడుగులు వేస్తుంటే చంద్రబాబు మాత్రం రాజధానిపై రాద్దాంతం చేస్తున్నారని అన్నారు.
రాజధాని నిర్మాణంపై మాట్లాడుతున్న చంద్రబాబు అభివృద్ది ఎక్కడ జరిగిందో చూపించాలని డిమాండ్ చేశారు. ఆయన ఇన్నాళ్లు గ్రాఫిక్స్తో కాలం వెళ్లదీశారని అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వందల కోట్ల రుపాయలకు కూడ టెండర్లు పిలవలేదని అన్నారు. ఇక బ్యాంకులు, బాండ్ల ద్వార 5వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన చంద్రబాబు అమరావతిని ఎందుకు నోటిఫై చేయలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే రాజధాని నిర్మాణం పై చంద్రబాబు చేసిన అవినీతిని బయటపెడతాని ఆయన హెచ్చరించారు.