ట్రబుల్ షూటర్లుగా బుగ్గన, అజేయకల్లం: రూ.5000 కోట్ల నిధులు రాబట్టుకోవడానికి పక్కా ప్లాన్
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం వల్ల రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజాా పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి పరిణామాల మధ్య వాయిదా వేశారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించడానికి సమాయాత్తమౌతోంది. వాటన్నింటినీ వివరించి, రాష్ట్రానికి రావాల్సిన 5000 కోట్ల రూపాయల నిధులను రప్పించుకోవడానికి కసరత్తు చేస్తోంది.

బుగ్గన, అజేయ కల్లంలకు బాధ్యతలు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బాధ్యతలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సలహాదారులు అజేయ కల్లంలకు అప్పగించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు సలహాదారులు, ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన కీలక అధికారులు త్వరలోనే దేశ రాజధానికి బయలుదేరి వెళ్తారని తెలుస్తోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ అధికారులను కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

రూ.5000 కోట్లను రాబట్టుకోవడంపై
ఈ నెల 31వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. దీన్ని నిర్వహించకపోతే స్థానిక సంస్థలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన 5000 కోట్ల రూపాయల నిధులు స్తంభించిపోతాయి. సకాలంలో ఈ నిధులను రాబట్టుకోవడానికి జగన్ సర్కార్.. యుద్ధ ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. దీన్ని వాయిదా వేశారు.

చంద్రబాబు వైఖరిని కేంద్రం దృష్టికి..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నిరోధించడంలో భాగంగా.. ఈ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఈ నిర్ణయాన్ని ఏకపక్షంగా.. ఎవ్వరితోనూ సంప్రదించకుండా తీసుకున్నారంటూ మొదటి నుంచీ ముఖ్యమంత్రి ఆరోపిస్తూ వస్తున్నారు. కేంద్రం నుంచి 5000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రాకుండా అడ్డుకోవడానికే చంద్రబాబు నాయుడి ఆదేశాలతో రమేష్ కుమార్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారంటూ విమర్శిస్తూ వస్తున్నారు. ఇదే అంశాన్ని అధికారికంగా కేంద్రానికి వివరించాలని జగన్ సర్కార్ భావిస్తోంది.

ఎన్నికల నిర్వహణ కోసం
స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించడానికి ఇప్పటిదాకా చేపట్టిన చర్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. పోలింగ్ ప్రక్రియను సజావుగా కొనసాగించడంలో భాగంగా- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు చివరికి పదవ తరగతి పరీక్షలను కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని కేంద్రానికి వివరించాలని నిర్ణయించుకుంది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 15వ తేదీ నాడే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ఇదివరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్థానిక పోరును దృష్టిలో ఉంచుకుని ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
Recommended Video

చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నం..
ఈ నెలాఖరులగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముగించడానికి తాము ఎంత చిత్తశుద్ధితో ప్రయత్నించినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ అడ్డు పడిందనే విషయాన్ని కేంద్రానికి వివరించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఫలితంగా- కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు అందాల్సిన నిధులను రాబట్టుకోవడం, తెలుగుదేశం వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2018లోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వాటిని నిర్వహించలేని వైనాన్ని కూడా వివరించే ప్రయత్నం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications