విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం: కిందపడిపోయిన ద్రవ ఉక్కు, నలుగురికి గాయాలు
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్ఎంఎస్-2లో ద్రవ ఉక్కుతో ఉన్న లాడిల్ జారిపోవడంతో అది నేలపై పడిపోయింది. ఉక్కు పడిన చోట ఆయిల్ ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే పనిచేస్తున్న నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి.
Recommended Video
సమాచారం అందుకున్న వెంటనే సంస్థ అగ్ని మాపక దళాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశాయి. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరిగలేదు. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. గాయాలపాలైన కార్మికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
అనంతపురం జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బత్తలపల్లి మండలం రాఘవంపల్లె వద్ద బైక్ను కారు ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే ఘటనా స్థలంలో ఉన్నవారిపైకి లారీ దూసుకెళ్లింది.
దీంతో మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.