కాల్పులు: కుటుంబాలమధ్యే: వంశీ, వీడియో దృశ్యాలు
ఘటనా స్థలంలో పోలీసులు 5 తుటాలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ సీపీ వెంకటేశ్వర రావు ఘటనాస్థలికి పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం విజయవాడ - ఏలూరు జాతీయ రహదారి పైన గాలింపు చేపట్టారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. మృతులు గంధం మారయ్య, పగిడి మారయ్య, నాగేశ్వర రావులు. గంధం మారయ్య
భయపడి పారిపోయా: కారు డ్రైవర్
నిందితులు కాల్పులు జరపడంతో భయపడి తాను పారిపోయి వచ్చానని ఏలూరు పోలీసు స్టేషన్లో లొంగిపోయిన కారు డ్రైవర్ తెలిపాడు. తాను విమానాశ్రయంలో ఓ ముసలాయన, మరో ఇద్దరిని ఎక్కించుకున్నానని, గన్నవరం వద్ద తమకు ముందు ఓ కారు వచ్చిందని డ్రైవర్ చెప్పాడు. తమకు గన్నవరం దాటే వరకు ఆ కారు దారి ఇవ్వలేదని చెప్పాడు. ముందు కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఆపేశానని, అనంతరం వారు వచ్చి కాల్పులు జరిపారని, దాంతో తాను భయపడి పారిపోయానని డ్రైవర్ చెప్పాడు. కాల్పులు జరిపిన వారు టక్ చేసుకొని నీట్గా వచ్చారన్నారు.
ఎక్కడి వారో తెలియాలి: కమిషనర్
పాతకక్షల వల్లనే కాల్పుల ఘటన జరిగిందని విజయవాడ సీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. పెదవేగి మండలం చిన్నకడిమికి చెందిన గంధం మారయ్య, పగిడి మారయ్య, నాగేశ్వరరావులుగా ప్రాథమిక సమాచారం అందినట్లు తెలిపారు. ఇరు కుటుంబాల మధ్య వైరం, ఆస్తి తగాదాల వల్లే హత్య జరిగినట్లు చెప్పారు. హంతకులు ఎక్కడివాళ్లో తెలియాల్సి ఉందన్నారు.
చిన్న కడిమికి చెందిన గంధం మారయ్య, నాగేశ్వరరావు, పగిడి మారయ్యలు గన్నవరం నుండి ఓ ట్రావెల్స్ తవేరా వాహనంలో ఏలూరు వెళ్తుండగా మరో వాహనం వచ్చిన దుండగులు దగ్గరి నుండి కాల్పుల జరిపినట్లుగా తెలుస్తోందని చెప్పారు. కాల్పుల అనంతరం నిందితులు దొంగ నెంబర్ ప్లేట్ ఉన్న ఇన్నోవాలో వెళ్లిపోయారని చెప్పారు.
కాగా, కొద్ది నెలల క్రితం దుర్గారావు అనే వ్యక్తి హత్య కేసులో ఇప్పుడు మృతి చెందిన వారి నిందితులు. వారు బెయిల్ పైన విడుదలయ్యారు. అనంతరం ముంబైలో ఉంటున్నారు. కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు వచ్చే సమయంలో ఈ ఘటన జరిగింది.
రెండు కుటుంబాల మధ్య జరిగిన హత్యలు: వల్లభనేని వంశీ
ఇవి రెండు కుటుంబాల మధ్య జరిగిన హత్యలు అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. పాత కక్షల వల్లనే ఇది జరిగిందన్నారు. సంఘటన జరిగిన 15 నిమిషాల్లోనే పోలీసులు పురోగతి సాధించారన్నారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన హత్యలు కాబట్టి.. ఈ ఘటనతో ప్రశాంత వాతావరణానికి భంగం కలగదన్నారు.
చిక్కిన వీడియో దృశ్యాలు
నిందితుల వాహనం దృశ్యాలు ఓ టోల్ గేటు వీడియోలో చిక్కాయి. పొట్టిపాడు టోల్ గేటు వద్ద వీడియో దృశ్యాలు చిక్కాయి. హత్య అనంతరం వాహనంలో వారు వేగంగా వెళ్తున్నట్లు గుర్తించారు.