ఏపీలో తొలి ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ప్రారంభం: ఎక్కడంటే..?
అమరావతి/అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైంది. డీఆర్డీఓ, ఎన్హెచ్ఏఐ సహకారంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వారం రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించారు.
ఈ ప్లాంట్ను మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారన్నారు. హిందూపురంలో ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు పెంచుతామన్నారు.
కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఎక్కడా లేదని, హిందూపురంలో ఏర్పాటైన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ దేశంలోనే మొదటిదని అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే.
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై సర్కారు కొరఢా
ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడం, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై అధికారులు కొరఢా ఝలిపించారు. ఆరోగ్యశ్రీ కింద 50శాతం పడకలు కేటాయించని ఆస్పత్రులపై గుంటూరు జిల్లా అధికారులు భారీ జరిమానాలు విధించారు. గుంటూరు జిల్లాలోని 52 ఆస్పత్రులకు మొత్తంగా రూ. 1.25 కోట్లు జరిమానా విధించినట్లు కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. 25 ఆస్పత్రులకు రూ. 2 లక్షల చొప్పున, 12 ఆస్పత్రులకు రూ. 5 లక్షల చొప్పున, 15 ఆస్పత్రులకు రూ. లక్ష చొప్పున జరిమానా విధించిటన్లు తెలిపారు. కాగా, ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కేసులు నమోదు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
ఏపీలో గడిచిన 24 గంటల్లో 91,120 నమూనాలను పరీక్షించగా.. 18,285 మంది కరోనా బారినపడిటన్లు వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,27,390కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 99 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 10,427కి చేరింది.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది మృతి చెందగా, పశ్చిమగోదావరిలో 14 మంది, విజయనగరంలో 9 మంది, అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో 8 మంది చొప్పున, కర్నూలులో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు మరణించారు. అదే సమయంలో 24,105 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 14,24,859కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులున్నాయి.