టిక్కెట్పై పలువురి సూసైడ్యత్నం, సురేఖ ఎఫెక్ట్ కూడా

ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు ఉద్యమంలో ఉన్న వాళ్లను కాదని, ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడమేమిటని విమర్శిస్తూ ప్రేమ్ కుమార్ అనే తెరాస కార్యకర్త ఆత్మాహుతికి ప్రయత్నించాడు. వరంగల్ తూర్పుపై తెరాస నేత విద్యాసాగర్ ఆశలు పెట్టుకున్నారు. ప్రేమ్ కుమార్ ఈయన అనుచరుడు. కుమార్ పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. మిగిలిన వారు ఆయనను అడ్డుకున్నారు.
పుర పోరులోను వేడి రాజుకుంది. కొంతమందికి నేరుగా బి-ఫారాలు దక్కడం, మరికొందరికి నామినేషన్ వేసినా ఆ ఫారమే అందకపోవడంతో చాలాచోట్ల ఈ ఘట్టం గరంగరంగా సాగింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మునిసిపాలిటీలోని 13వ వార్డుకు బిజెపి అభ్యర్థిగా జంగిటి లక్ష్మి నామినేషన్ వేశారు. అయితే, చివరి నిమిషంలో ఆమెకు బి-ఫారం దక్కలేదు.
దీనిపై ఆమె ఆందోళనకు గురి కాగా, ఆమె కుమారుడు నరేశ్ ఆత్మహత్యాయత్నం చేశారు. కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావు ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకొని హల్చల్ సృష్టించారు. తమ అమ్మకు న్యాయం చేయాలంటూ విద్యాసాగర్ రావు కాళ్లపై పడి విలపించారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 41వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో మాజీ ఎంపి జితేందర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇంతలో జయమ్మ ఒక్కసారిగా కిరోసిన్ పోసుకొన్నారు. 41వ వార్డుకు జయమ్మని అభ్యర్థిగా ప్రకటించాలంటూ ఆమెకు మద్దతుగా వచ్చిన వారంతా.. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు, అంతే ఆగ్రహానికి గురయ్యారు. ఆమెపై నీళ్లు చల్లి తెరాస అధినాయకత్వంపై నిప్పులు చెరిగారు. నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ గౌడ్ వారించినా నెమ్మదించలేదు. తనను ఎంపిక చేసి చివరి నిమిషంలో మరొకరి పేరు ప్రకటించారని జయమ్మ వాపోయారు.
ఖమ్మం జిల్లా ఇల్లెందులో బి-ఫారాల కోసం ఎంపి రేణుకా చౌదరి, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ చిక్కుని విప్పే పనిని కేంద్ర మంత్రి బలరాం నాయక్కు టిపిసిసి అప్పగించింది. అయితే ఆయన వెంకట్ రెడ్డి వర్గాన్ని దగ్గరకు తీసుకొని, తమను పక్కన పెట్టేశారంటూ మహిళా కాంగ్రెస్ పట్టణాధ్యక్షురాలు శ్రీదేవి, డిసిసి మాజీ ప్రచార కార్యదర్శి అక్కిరాజు గణేశ్లు ఆత్మహత్యాయత్నం చేశారు.
విలేకరులతో మాట్లాడుతూనే శ్రీదేవి పురుగుమందు డబ్బాని గొంతులోకి వొంపేసుకోగా, గణేశ్ సెల్టవర్ ఎక్కి హల్చల్ సృష్టించారు. శ్రీదేవి ఆత్మహత్యాయత్నం వార్త తెలిసిన వెంటనే భర్త సత్యనారాయణ కుప్పకూలిపోయారు. ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని ఐదో డివిజన్ నుంచి టిడిపి తరఫున రమాదేవి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆమెకు బి ఫారం ఇవ్వలేదు. దీనిని ఆమె తట్టుకోలేకపోయారు. పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఇంటి వద్దకు సరాసరి వెళ్లారు. వెంట తెచ్చుకొన్న పురుగుల మందు డబ్బా చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకొన్నారు. శ్రీనివాసులు జోక్యంతో ఆమె శాంతించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మేయర్ అభ్యర్థి విషమయై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంపై ఓ వర్గం రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications