బాబు ప్రమాణం: నారా లోకేష్ బిజీ, 5ఫ్లైట్లలో విఐపిలు
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి బిజెపి అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న 70 ఎకరాల స్థలంలో ఆదివారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్లు వచ్చారు. వెంకయ్య శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగానే టిడిపి, బిజెపి కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీతో పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు. మరోవైపు నిర్మలా సీతారామన్ హైదరాబాద్ వచ్చారు. రాజ్ నాథ్ సింగ్ కూడా రానున్నారు. పంజాబ్, గోవా, గుజరాత్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్,గోవా ముఖ్యమంత్రులు హాజరుకానున్నారని సమాచారం.

ఏర్పాట్ల పరిశీలనలో లోకేష్
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ శనివారం విజయవాడకు రానున్నారు. విజయవాడ, గుంటూరుల్లో ఉంటూ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పరిశీలిస్తారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి విఐపిలు, వివిఐపిలు ఐదు ప్రత్యేక విమానాల్లో ఆదివారం గన్నవరం రానున్నారు.
మరోవైపు బాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే వారి కోసం స్పైస్ జెట్ ప్రత్యేక విమానం నడపనుంది. 200 సీట్లు ఉండే ఈ విమానం ఆదివారం మధ్యాహ్నం 3.2 నిమిషాలకు హైదరాబాదులో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది. రాత్రి 11.30గంటలకు అక్కడి నుండి తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. రానుపోను టిక్కెట్ ధర రూ.12వేలు. టిక్కెట్ల విక్రయానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శనివారం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.
నల్లధనం వెనక్కి తెచ్చే ప్రయత్నం: నిర్మలా
హైదరాబాద్ వచ్చిన నిర్మలా సీతారామన్కు తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. బిజెపి కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. నల్లధనం వెనక్కి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తామన్నారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టాల్సి ఉందన్నారు. మోడీ నాయకత్వంలో అందరం కలిసి పని చేద్దామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. తెరాస ప్రభుత్వం రుణమాఫీ విషయమై మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.












Click it and Unblock the Notifications