ఇక జమిలి ఎన్నికలు ఖాయం - ఎన్నికల సంఘం సై : జగన్ సిద్దం- కలిసొచ్చేనా..!!
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ విజయం ఎవరిదో స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ దూకుడు మీద కనిపిస్తోంది. మోదీ మేనియా తగ్గలేదని రుజువైంది. కీలకమైన యూపీతో సహా మరో మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడటానికి లైన్ క్లియర్ అవుతోంది. పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కమలం పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఫలితాలు ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం ఫలితాలు పూర్తిగా రాకముందే జమిలి ఎన్నికల వైపు ఫోకస్ చేస్తోంది.

అయిదు రాష్ట్రాల ఫలితాలతో కొత్త అంశం
ప్రధానిగా మోదీ రెండో సారి పగ్గాలు చేపట్టిన వెంటనే అన్ని పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసారు. జమిలి ఎన్నికల దిశగా వారి అభిప్రాయాలు సేకరించారు. అయితే, ఆ తరువాత కరోనా..ఎదురైన పరిస్థితులతో నిర్ణయం కార్యాచరణ జరగలేదు. ఇక, మోదీ రెండో సారి ప్రధాని అయి మూడేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సమయంలో ఈ ఫలితాలు ఆశాజనంగా మారాయి. ఇదే సమయంలో..కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్యూలో తాము జమిలి ఎన్నికలకు సిద్దమని కీలక ప్రకటన చేసారు.

జమిలి ఎన్నికలకు సిద్దమంటూ
ఎన్నికల సంఘం జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉందని..పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు. దీనిని సరైన నిర్ణయంగా అభివర్ణించారు. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. వచ్చే జూన్ లో రాష్ట్రపతి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మేరకు బీజేపీ పార్లమెంట్ లో జమిలి ఎన్నికల దిశగా చట్ట సవరణకు ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ద్వారా ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయం..ట్రిపుల్ తలాఖ్ రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్న ప్రధానిగా మోదీ..ఇప్పుడు తన ఖాతాలో ఒకే దేశం - ఒకే ఎన్నిక సైతం చేరాలని కోరుకుంటున్నారు. అదే జరిగితే జమిలి ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి.

ఏపీ సీఎం జగన్ సై అంటారా
ఏపీ ముఖ్యమంత్రి జగన్ 2019లోనే ప్రధానితో జరిగిన సమావేశంలోనే తాము జమిలికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటారా..మార్చుకుంటారా అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికలు ఏ సమయంలో అయినా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా టీడీపీ నేతలు చెబుతున్నారు. సీఎం జగన్ సైతం తమ పార్టీ నేతలను ఎన్నికల మూడ్ లోకి తీసుకొచ్చే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం ఈ నెల నుంచి రంగంలోకి దిగుతున్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. అయితే, ఈ మూడేళ్ల కాలంలో దాదాపు రెండేళ్ల సమయం కరోనా తో పోరాటమే ప్రభుత్వానికి సరిపోయిందని..చివరి రెండేళ్లు మరోసారి అధికారంలో కొనసాగాలంటే తీసుకొనే నిర్ణయాలకు కీలక సమయమనే వాదన పార్టీలో వినిపిస్తోంది.

ఏపీలో ఎవరికి కలిసొచ్చేను
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం తమకు పరిస్థితి అనుకూలంగా ఉందంటూ టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అయితే, జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న సమీకరణాల ఆధారంగా జమిలి పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే , రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం బీజేపీకి వైసీపీ మద్దతు కీలకంగా మారనుంది. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో గెలుపు ఖాయంగా కనిపిస్తుండటంతో ఎలక్ట్రోల్ కాలేజీలో బీజేపీ ఓట్ షేర్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు కేంద్రం జమిలి ఎన్నికల విషయంలో ఏం చేయబోతోంది... అదే జరిగితే ఏపీలో ఎవరికి కలిసి వస్తుందనే చర్చ రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications