మోడీ స్వచ్ఛ భారత్, జగన్ ధర్నా ఫ్లెక్సీలు: వైసీపీ వర్సెస్ టీడీపీ
శుక్రవారం నుంచి తాము తలపెట్టిన ధర్నాకు సంబంధించి ఆ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించివేసి, టీడీపీ నేతలు తమ ఫ్లెక్సీ కట్టుకున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, వైసీపీ నేత కొలుసు పార్థసారథి వర్గీయులు గురువారం సాయంత్రం పెద్ద సంఖ్యలో రోడ్డుమీదకొచ్చారు.
అయితే స్వచ్ఛ భారత్కు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కట్టారని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వర్గీయులు ఆరోపించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో మొదలైన రగడ దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది.
మాజీ మంత్రి పార్థసారథిని పోలీసులు అదుపులోకి తీసుకుని కంకిపాడు తీసుకెళ్లి, విడిచిపెట్టారు. దీంతో పోరంకిలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మరో పదిమంది తనను కులం పేరుతో దూషించి, చెయ్యి చేసుకున్నారని పార్థసారథి కారు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మళ్లీ ఇరు వర్గీయులూ గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. సమాచారం తెలుసుకున్న డీసీపీ, ఏసీపీ పెనమలూరు స్టేషన్ వద్దకు చేరుకున్నారగు. పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అక్కడకు వచ్చారు. దీంతో, పారా మిలటరీ దళాలను రంగంలోకి దింపడంతో పరిస్థతి అదుపులోకి తెచ్చారు.