సీఎం సొంత జిల్లాలో సజ్జలకు నిరసన సెగ; పరిహారం సరిపోదన్న బాధితులు, సర్ది చెప్పిన సజ్జల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. రాయలసీమ ప్రాంతంలో వర్షాలు, వరదలతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. వరద ముంపు ప్రాంతాలలో బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినా అవి అరకొరగా ఉన్నాయి అన్న టాక్ వినిపిస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైసిపి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, వైసీపీ ముఖ్య నేతలకు ప్రజల నుండి నిరసన వ్యక్తమవుతోంది.

పరిహారం సరిపోదని సజ్జల ముందు పులపుత్తూరు గ్రామస్తుల అసహనం
మొన్నటికి మొన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డిలకు నెల్లూరు జిల్లాలో వరద బాధితుల నుండి నిరసన సెగ తగలగా, తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వరద బాధితుల నుండి నిరసన వ్యక్తమైంది. సీఎం సొంత జిల్లా అయిన కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ముందు ప్రభుత్వం ఇచ్చిన సహాయం ఏ మాత్రం సరిపోవడం లేదని వరద బాధితులు అసహనం వ్యక్తం చేశారు. రాజంపేట నియోజకవర్గంలోని పులపుత్తూరు గ్రామస్తులు వరదల్లో సర్వం కోల్పోయామని ప్రస్తుతం ఇస్తున్న పరిహారం ఏ మాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక ఎమ్మెల్యే అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన సజ్జల
స్థానిక ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలలో పులపుత్తూరు, మండపల్లి, తొగురుపేట, గుండ్లూరు, అన్నమయ్య ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటించిన సజ్జల రామకృష్ణారెడ్డి నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. బాధితులకు సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నామని, వారి సమస్యలు తెలుసుకోవడానికి తాను వచ్చానని, వారి సమస్యలను పరిష్కరించడానికి తగిన కృషి చేస్తానని ఆయన బాధితులకు వెల్లడించారు.

వరదకు కారణాలు చెప్పి,ఆదుకుంటామని హామీ ఇచ్చిన సజ్జల
ఒక సంవత్సర కాలంలో నమోదు కావలసిన మొత్తం వర్షం ఒకేరోజు రావడంతో వరద ఎక్కువగా వచ్చిందని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో పించా, అన్నమయ్య జలాశయాల కట్టలు తెగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించిందని వెల్లడించారు. సర్వే చేసి బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన ఆయన, వర్షాలు, వరదల వల్ల పూర్తిస్థాయిలో ఇళ్లు కోల్పోయిన వారికి ఐదు సెంట్ల స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

డిసెంబర్ 2 న సీఎం జగన్ పర్యటన ఉందన్న సజ్జల
డిసెంబర్ 2వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారని బాధితులను పరామర్శిస్తారు అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. జగన్ పర్యటన తర్వాత పరిస్థితులు బట్టి మరింత పరిహారం ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకపక్క వరద ప్రభావిత ప్రాంతాలలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులతో బాధితుల ఆవేదన
మరోపక్క వరద ముంపుకు ప్రధాన కారణం వైసీపీ సర్కార్ ముందుగా అప్రమత్తం కాకపోవడం అని టిడిపి నేతలు చెబుతున్న నేపథ్యంలో వైసిపి సర్కారు తీరుపై ఒకింత అసహనం వ్యక్తం అవుతుంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా అంతంతమాత్రంగా ఉన్నాయని ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు వరద పరిస్థితులపై తెలుసుకోవడానికి వెళుతున్న క్రమంలో ప్రజల నుండి తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. తమ సమస్యలను పట్టించుకోవాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications