సింగర్ మంగ్లీకి కీలక పదవి - మంత్రి రోజాను కలిసినప్పుడే: టాలీవుడ్పై గ్రిప్..!!
అమరావతి: జానపద గాయని సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ అడ్వైజర్గా ఆమె అపాయింట్ అయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు ఎస్వీబీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఆమె బాధ్యతలను కూడా స్వీకరించారు. పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా పుట్టినరోజు సందర్భంగా ఆమెను కలిశారు మంగ్లీ. ఎస్వీబీసీ సలహాదారు హోదాలోనే మర్యాదపూరకంగా కలిశారని చెబుతున్నారు.

ప్రైవేట్ ఆల్బమ్స్తో..
లంబాడి సామాజిక వర్గానికి చెందిన గాయని మంగ్లీ. ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక మ్యూజిక్లో డిప్లొమా పూర్తి చేశారు. అనంతరం యాంకర్గా తన కేరీర్ను ఆరంభించారు. మ్యూజిక్పై ఆసక్తి ఉండటంతో సింగర్గా మారారు. జానపద గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. అవన్నీ ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి.

తెలంగాణ సంస్కృతిపై..
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆల్బమ్స్ను రూపొందించారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే బతుకమ్మ, సమ్మక్కసారక, బోనాల ఉత్సవాలపై మంగ్లీ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆయా పండగల సమయాల్లో మంగ్లీ పాడిన పాటలు గ్రామగ్రామాన వినిపిస్తుంటాయి. ఈ ఆల్బమ్స్ ఆమెను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేేశాయి. ప్లేబ్యాక్ సింగర్గా స్థిరపడ్డారు.

ఉన్నత స్థానంలో..
ఇప్పుడు తాజాగా- ఎస్వీబీసీ సలహాదారుగా నియమితులు కావడం మంగ్లీ కేరీర్లో మరో మలుపు. తొలిసారిగా ప్రభుత్వపరంగా ఓ ప్రతిష్ఠాత్మక పదవిని అందుకున్నారామె. మంత్రి రోజాతో ఉన్న సాన్నహిత్యం కారణంగా ఈ పదవి లభించిందనే ప్రచారం ఉంది. లంబాడీ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినట్టయిందని చెబుతున్నారు.

వైఎస్ జగన్పై ఆల్బమ్
గతంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్.. పాదయాత్ర చేపట్టిన సమయంలో ఆయనపై మంగ్లీ కొన్ని పాటలు పాడారు. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న.. పాట సూపర్ హిట్గా నిలిచింది. తూరుపు దిక్కున భానుడు లేచే.. వంటి పాటలు ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియా గ్రూప్స్లల్లో ఈ పాట వినిపిస్తుంటుంది.

టాలీవుడ్పై..
కాగా- రాజకీయంగా కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మేలు కలుగజేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇప్పటికే టాలీవుడ్కు చెందిన ప్రముఖులకు కీలక బాధ్యతలు లభించాయి. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా కమేడియన్ అలీ ఈ మధ్యే బాధ్యతలను తీసుకున్నారు. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళికీ కీలక పదవి ఇచ్చారాయన. ఏపీ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించారు.












Click it and Unblock the Notifications