చంద్రబాబా! మజాకా!! : సొంత మనుషుల కోసమే.. అమరావతి భవనాల నిర్మాణం ‘తడిసిమోపెడు’
అమరావతి: నాటి యూపీఏ ప్రభుత్వం.. 2013 - 14 మధ్య తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను చేపట్టినప్పుడు ప్రస్తుత ఏపీ సీఎం, నాటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు పదేపదే ఒక వాదన ముందుకు తెచ్చారు. రాజధాని నిర్మాణానికి రూ. లక్ష కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇదంతా ప్రచారార్భాటం కోసం అని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతం స్వర్గంలో.. దేవేంద్రుడి రాజధాని పేరిట నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపాదిత 'అమరావతి' రాజధాని నిర్మాణానికి.. అక్కడ సర్కారీ పాలన సజావుగా సాగడానికి అవసరమైన సచివాలయం, అసెంబ్లీ, మంత్రులు, అధికారుల నివాసాలు, కేసుల విచారణకు హైకోర్టు.. ఇక గవర్నర్ నివాసం 'రాజ్ భవన్' నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తున్నప్రతిపాదిత అంచనాలతో కళ్లు చెదిరిపోతున్నాయంటే నమ్మండి..
Recommended Video

అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణానికి రూ.2,229 కోట్లు అవసరమని అంచనా వేస్తే, సచివాలయానికి రూ.2,728 కోట్లు.. ఖర్చు అవుతుందని నిర్మాణ రంగ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన అంచనాలు. ఈ అంచనాలు కూడా తాత్కాలికమే సుమా, పరిస్థితులు మారినా కొద్దీ, సామగ్రి ధరలు పెరిగినా కొద్దీ.. ప్రస్తుతం 'పోలవరం' అంచనాలు మారినట్లే మారిపోతాయి మరి. వీటికి మౌలిక వసతుల కల్పన, పర్యావరణ హితమైన గ్రీనరీ ఖర్చులు అదనంగా చేర్చుకోవాల్సి ఉంటుంది.

కళ్లు బైర్లు కమ్మేలా ఏపీ ప్రభుత్వ అంచనాలు.. ప్రతిపాదనలు
మరి ఏపీ సీఎం చంద్రబాబు అంటే మజాకా మరి..దీని ప్రకారం ఆయా రాజధానిలోని పాలనా భవనాల నిర్మాణానికి ప్రతి చదరపు అడుగుకు రూ.7,179 ఖర్చవుతుందని తాత్కాలిక అంచనాల్లో నిపుణులు నిగ్గు తేల్చారు. కానీ వాస్తవంగా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో భవనాలు, అపార్టుమెంట్లతోపాటు విలాసవంతమైన భవనాలు అంటే విల్లాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆయా ఇళ్ల నిర్మాణ అంచనాలు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత భవనాల నిర్మాణ అంచనాలు సరిపోలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయంటే అతిశయోక్తి కాదు.

మౌలిక వసతులు కల్పించినా భారీగా చంద్రబాబు సర్కార్ నిర్మాణ అంచనాలు
ఒక ఇంటి నిర్మాణానికి చదరపు అడుగుకి రూ.1,500 నుంచి రూ. 2,000 లోపు ఉండవచ్చు. ఎంత విలాసవంతమైన నిర్మాణానికైనా చదరపు అడుగుకి రూ.3వేలకు మించదని నిపుణులు అంటున్నారు. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్లకు అమరావతిలో భూమి ఉచితంగా ఇచ్చి మౌలికవసతులు కల్పించి నిర్మాణం కోసం భారీగా డబ్బు వెదజల్లబోతోంది. తాజాగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు చదరపు అడుగుకు రూ. 7,179 వెచ్చించబోతోంది. కనీవిని ఎరుగని రీతిలో రెట్టింపునకు మించి ఎందుకు ఖర్చుచేయబోతోంది? ఇందులో ఇమిడి ఉన్న రహస్యమేమిటని సందేహిస్తున్నారు.

హడావుడిగా నిర్మాణ భవనాల అంచనాలు ఆశ్చర్యకరం
ఎంతోకాలంగా నిర్మాణ రంగంలో ఉన్న నిపుణులను సైతం అమరావతి భవనాల నిర్మాణ అంచనాలు ఆశ్చర్య చకితులను చేస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ అనుకూల కాంట్రాక్టర్లకు అదనంగా దోచిపెట్టడానికే ఈ స్థాయిలో భారీ అంచనాలు రూపొందించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడున్నరేళ్లపాటు డిజైన్లే ఖరారు చేయని రాష్ట్రప్రభుత్వం ఇపుడు హడావిడిగా భారీ అంచనాలు రూపొందించడం కూడా అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది.

పరస్పర విరుద్ధ ప్రతిపాదనలు రూపొందించిన ఏపీ సర్కార్
రాజధాని అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలను కూడా ఎక్కడా లేని స్థాయిలో భారీ వ్యయాలతో చేపడుతున్న ప్రభుత్వం తాజాగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలకు మరింత దిమ్మతిరిగే అంచనాలు రూపొందించింది. సచివాలయ నిర్మాణానికే రూ.2,728 కోట్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు రూ.2,229 కోట్లు అవసరం అవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అంచనా వేసింది. అంటే ఈ మూడు భవనాలకే దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చవుతాయని లెక్కగట్టారన్నమాట. వీటికి సంబంధించి సీఆర్డీఏ త్వరలో టెండర్లు పిలవనున్నది. రెండేళ్ల క్రితం పరిపాలనా నగర నిర్మాణానికి రూ. 6000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేవలం మూడు భవనాలకే రూ.5000 కోట్లు ఖర్చవుతాయని అంచనావేయడం గమనార్హం.

ప్రభుత్వ భవనాల నిర్మాణ అంచనాలు చదరపు అడుగుకు రూ. 7,179
మూడు భవనాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వేసిన అంచనాల ప్రకారం సచివాలయ నిర్మాణానికి చదరపు అడుక్కి రూ.7,179, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు చదరపు అడుక్కి రూ.6,192 ఖర్చవుతుంది. సాధారణ భవనాల నిర్మాణానికి చదరపు అడుక్కి రూ.1,500 ఖర్చవుతుండగా విలాసవంతంగా నిర్మించినా మూడు వేలు మించదని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. అలాంటిది ఈ మూడు భవనాలకు చదరపు అడుగుకు ఏకంగా ఆరు నుంచి ఏడు వేల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తూ త్వరలో టెండర్లు పిలవడానికి రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది

రూ.180 కోట్ల నుంచి రూ.660 కోట్లకు పెంపు
వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు ప్రభుత్వం ఇలాగే భారీగా ఖర్చు పెట్టింది. చదరపు అడుగుకు రూ.3,150 చొప్పున టెండర్లను ఖరారు చేసినా చివరికి దాన్ని రూ.6000 వరకూ తీసుకెళ్లింది. అందుకే రూ.180 కోట్ల నుంచి మొదలైన ఈ నిర్మాణాల వ్యయం ప్రభుత్వం లెక్కల ప్రకారమే రూ.660 కోట్లయింది. మౌలిక వసతులు, గ్రీనరీ, ఇతర ఖర్చులతో కలిపి ఈ తాత్కాలిక భవనాలకు సుమారు వెయ్యి కోట్లు అయినట్లు అనధికారిక సమాచారం. ఈ నేపథ్యంలో ప్రాథమిక అంచనాలే రూ.ఐదు వేల కోట్లుగా ఉన్న ఈ ఐకానిక్ భవన నిర్మాణాల ఖర్చు చివరికి వచ్చేసరికి అంతకంతకు రెట్టింపు కావచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మంత్రుల బంగళాల చదరపు అడుగు నిర్మాణానికి రూ.7,916
సచివాలయాన్ని నాలుగు టవర్లుగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 33 శాఖలకు చెందిన విభాగాధిపతులు ఉండేలా 38 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం నిర్మించేందుకు రూ.2,728 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ లెక్కన చదరపు అడుగుకు రూ.7,179 ఖర్చవుతుంది. ఇటీవలే నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన టవర్ డిజైన్తో 11 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ భవనం, స్థూపం డిజైన్తో 25 లక్షల చదరపు అడుగుల్లో హైకోర్టు భవనం నిర్మాణానికి రూ.2,229 కోట్లవుతుందని అంచనా వేసింది. చదరపు అడుక్కి రూ.6,192 ఖర్చవుతుంది. నిర్మానుష్య ప్రాంతంలో చేపట్టే ఈ భవనాల ప్రాంగణంలో మౌలిక వసతులు, గ్రీనరీ, ఇతర హంగుల ఖర్చులు వీటికి అదనం. తాత్కాలిక సచివాలయం మాదిరిగా ఈ అంచనాలు భవనాల నిర్మాణం వరకే తీసుకుంటే ఇంటీరియర్, విద్యుత్ వ్యవస్థ, డ్రెయినేజీ తదితర వాటికి రెట్టింపు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు, ఉద్యోగులకు నివాసం కోసం నిర్మించే అపార్టుమెంట్లకు చదరపు అడుగుకు రూ.2,510 ఖర్చు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మంత్రుల బంగ్లాలకు మాత్రం చదరపు అడుగుకు రూ.7,916 ఖర్చవుతుందని అంచనా వేయడం విశేషం.

డిజైన్ల ఆమోదంపై నెటిజన్ల విమర్శలు ఇలా
‘నార్మన్ ఫోస్టర్ సంస్థ రెండు డిజైన్లు ఇచ్చిందంటారు.. బాహుబలి దర్శకుడు రాజమౌళి డిజైన్ తిరస్కరించారంటారు. ఓ డిజైన్ను ప్రజల అభిప్రాయం కోసం సోషల్ మీడియాలో విడుదల చేశామంటారు. టవర్ డిజైన్కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటారు.. ఆ డిజైన్ అంత ఆకర్షణీయంగా లేదని, పెద్ద చిత్రాలు చూపాలని మంత్రులు కోరితే స్ట్రక్చరల్ డిజైన్లు రావడానికి ఆరునుంచి ఎనిమిదివారాలు పడుతుందని మంత్రి నారాయణ చెబుతారు.. ఇడ్లీపాత్ర ఆకారంలో నిర్మాణమేమిటని నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారంటారు' ఇంతకీ అమరావతిలో నిర్మించబోయే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు డిజైన్లు ఖరారయ్యాయా.. ఖరారైతే అవి ఏమిటి? రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు ఏదీ స్పష్టంగా చెప్పకపోవడంపై సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలతో హోరెత్తిస్తున్నది.

ఇలా ప్రభుత్వ భూముల్లోనే పాలనా భవనాల నిర్మాణం
చదరపు అడుగుకు రూ. 6000 నుంచి 7000 వేలు చాలా ఎక్కువ. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో చదరపు అడుగుకు రూ.4000తో విశాలమైన భవనాలు నిర్మించవచ్చునని బిల్డర్లు చెప్తున్నారు. గమ్మత్తేమిటంటే దీంట్లో భూమి ధర కూడ కలుపుకొని ఉంటుందంటున్నారు. రాజధానిలో భవనాల నిర్మాణానికి ఉపయోగిస్తున్న భూమి కూడ ప్రభుత్వానిదే. ఇంకా అనేక సౌకర్యాలు కూడా నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం కల్పిస్తోంది. అయినా అంత భారీ రేటు ఇవ్వాలని నిర్ణయించారంటే ఏదో మతలబు ఉందని అర్ధమవుతున్నదని పాండురంగారావు అనే బిల్డర్ వ్యాఖ్యానించారు.

సాంకేతికత పెరిగినా విచిత్రంగా అధికమవుతున్న ఖర్చు
రాష్ట్ర ప్రభుత్వం కావాలని నిర్మాణ సంస్థలకు రేటు పెంచి ప్రాజెక్టులను అప్పగిస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయని ఇంజినీరింగ్ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ నిర్మాణాల పేరుతో పెద్ద పెద్ద కంపెనీలకు ఈ పనులు అప్పగిస్తున్నారు. ఆ కంపెనీలు మ్యాన్ పవర్ను తగ్గించి, సాంకేతికతను ఉపయోగించుకొని పనులు చేస్తున్నాయి. సాంకేతికత పెరిగినప్పుడు ఖర్చు తగ్గాలే కానీ అమరావతిలో విచిత్రంగా పెంచుతున్నారు. ఇదంతా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఎం వీ దాస్ అనే ఇంజనీరింగ్ నిపుణుడు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications