పులివెందులలో జగన్ కు భద్రత, జనానికి ఆంక్షలు-సర్వత్రా చర్చ-వైఎస్ కంచుకోటలో ఎందుకిలా ?
ఏపీలో ఏ రాజకీయ కుటుంబానికీ సాధ్యం కాని రీతిలో ఓ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానికి మాత్రమే ఉంది. అలాగే ఓట్లు అడగకపోయినా ప్రతీసారీ ఆ కుటుంబాన్ని గెలిపించడాన్ని అలవాటుగా మార్చుకున్న చరిత్ర పులివెందులకు ఉంది. అలాంటి పులివెందులలో తొలిసారి వైఎస్ కుటుంబ వారసుడు, సీఎం జగన్ అదనపు భద్రత తీసుకోవడం, అదే సమయంలో ప్రజలపైనా ఆంక్షలు విధిస్తూ బారికేడ్లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. జగన్ తాజా పులివెందుల టూర్ ఇందుకు వేదికైంది.
పులివెందులలో వైఎస్ హవా
ఎప్పుడో 1978లో వైఎస్ కుటుబం నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందులలో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ పులివెందులలో వైఎస్ కుటుబంం హవా కొనసాగుతూనే ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేదా ఆయన కుటుంబ సభ్యులు నిరాటంకంగా గెలుస్తూనే ఉన్నారు. మెజార్టీలో కాస్త హెచ్చుతగ్గులున్నా గెలుపు మాత్రం వారినే వరిస్తూ వస్తోంది. దీని వెనుక చాలా చారిత్రక కారణాలున్నాయి. స్ధానికంగా వైఎస్ రాజారెడ్డితో మొదలుపెట్టి ఇప్పుడు వైఎస్ జగన్ వరకూ సాగిన ప్రస్ధానంలో ప్రజలతో ఆ కుటుంబం మమేకం అయిన తీరు రాష్ట్రంలో ఇంకెక్కడా సాధ్యం కాలేదు. అలాంటి పులివెందులలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
జగన్ కు భద్రత పెంపు
తాజాగా తన తండ్రి వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కడప జిల్లా పులివెందుల వెళ్లిన సీఎం జగన్ కు గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు భద్రత పెంచారు. జగన్ వెళ్లే దారుల్లో, ఆయన సమావేశాలు నిర్వహించే చోట్ల, అలాగే ఇంటి వద్ద కూడా అదనపు భద్రత కల్పిస్తున్నారు. ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద ఏటా నిర్వహించే కార్యక్రమాలకు కూడా నిఘా పెరిగింది. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. తన తండ్రి హయాం నుంచి తమకు వరుసగా విజయాలు కట్టబెడుతున్న పులివెందులలో భద్రతను లెక్కచేయకుండా పర్యటించడం వైఎస్ జగన్ కు అలవాటే. కానీ ఈసారి చోటు చేసుకుంటున్న పరిణామాలు చుట్టూ ఉండే వారిని ఆశ్చర్య చకితుల్ని చేస్తున్నాయి.
తొలిసారి అభిమానులపై ఆంక్షలు
అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఆ కుటుంబంలో ఎవరైనా హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ పులివెందుల వెళ్లినప్పుడు ప్రజలతో మమేకం అవుతుంటారు. వారు కూడా తమ కష్టాలు తెలిసిన నేతలు కావడంతో వారిని కలిసేందుకు ఎదురుచూస్తుంటారు. కానీ ఈసారి పరిస్ధితి మారింది. పులివెందులతో పాటు వేంపల్లెలో జగన్ టూర్ సందర్భంగా రోడ్లకు ఇరువైపులా బ్యారికేడ్లు పెట్టారు. దీంతో జనం స్వేచ్ఛగా జగన్ ను వచ్చి కలిసే వీలు లేకుండా పోయింది. దీంతో ప్రజల నుంచి అధికారులే వినతులు స్వీకరిస్తున్నారు.
పులివెందులలో ఎందుకిలా ?
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తున్న పులివెందులలో అదే కుటుంబ వారసుడు, రాష్ట్ర ముఖ్మమంత్రి కూడా అయిన జగన్ కు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ ఇప్పుడు కడపతో పాటు ఇతర చోట్లా జరుగుతోంది. భద్రతను లెక్కచేయకుండా ప్రజలతో నిత్యం మమేకం అయ్యే కుటుంబానికి ఇప్పుడు భద్రత అవసరం ఎందుకొచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానంగా బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య దర్యాప్తు, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణం కావొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తుండటం, నిందితులు సాక్ష్యుల్ని అంతం చేస్తారన్న భయాలు, ఈ కేసులో కడప ఎంపీ, జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి పాత్రపై చర్చ జరుగుతుండటం వంటి పరిణామాలు స్దానికంగా జగన్ కుటుంబానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్ధితి లేకే ఈ ఆంక్షల రూపంలో వారిని దూరంగా ఉంచుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.