అటవీ హక్కుల చట్టానికి...ఫారెస్ట్ అధికారులు తూట్లు : సున్నం రాజయ్య
తూర్పుగోదావరి: ఏజెన్సీలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా అటవీశాఖ అధికారులు తూట్లు పొడిచి నిర్వీర్యం చేస్తున్నారని ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లపై భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా చింతూరులోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దబ్బగూడెం, దొండగూడెం గ్రామాల్లోని గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో మోతుగూడెం ఫారెస్ట్ రేంజ్ అధికారులు మొక్కలు వేస్తున్నారని, ఇలా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా గిరిజనుల నుంచి భూములను లాక్కొనేందుకు కుట్ర పన్నుతున్నారని సున్నం రాజయ్య ఆరోపించారు.
ఈ సందర్భంగా అటవీ హక్కుల చట్టంలోని ముఖ్యంశాలను వివరించారు. ది షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఇతర సాంప్రదాయక అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 (నెం.2/2007)ను భారత పార్లమెంట్లో 2006, డిసెంబర్ 15న ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా ఆదివాసులు డిసెంబర్ 15వ తేదీని అటవీ హక్కుల సాధనా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. గిరిజనులు నివసించే ప్రాంతం 5వ షెడ్యూల్డ్ ప్రాంతంగా గుర్తించబడింది.
అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ రాష్ట్రాల్లో 800కు పైగా ఆదివాసీ గ్రామాలు నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్నాయి. అటవీ హక్కుల గుర్తింపు చట్టం అడవి ఉన్న అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఏమి హామీలు ఇచ్చింది?...అటవీ భూమి అంటే అడవిగా నిర్వచించిన, గుర్తించిన లేదా ప్రకటించిన ఏదైనా ప్రదేశం, రక్షిత అడవులు, రిజర్వ్ అడవులు, అభయారణ్యాలు, జాతీయ పార్కులు వంటివి. వీటిలో డిసెంబర్ 13, 2005 కన్నా ముందు నివసిస్తున్న, సాగుచేసుకుంటున్న ప్రజలకు వ్యక్తిగత, సామూహిక హక్కులు గుర్తించి, దఖలు పరిచే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది.
13 రకాల హక్కులుగా చట్టంలో పేర్కొన్నారు. అదేవిధంగా హక్కులతో పాటు అడవిని, జీవవైవిధ్యాన్ని సుస్థిరంగా కాపాడటంలో, పరిరక్షించడంలో ఆదివాసులకు బాధ్యతలు, అధికారాలు కల్పించారు. అటవీ యాజమాన్యం, పాలనా వ్యవస్థలు బలోపేతం చేయటానికి గ్రామసభలకు విశేష అధికారాలు ఈ చట్టంలో పేర్కొన్నారు.
అనంతరం సున్నం రాజయ్య సిపిఎం నాయకులతో కలిసి దబ్బగూడెంలో పర్యటించారు. సుమారు 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఒగ్గిల భీమయ్య, సోడె ముత్తయ్య భూముల్లో ఫారెస్ట్ అధికారులు నాటిన మొక్కలను పరిశీలించారు.