జగన్ సర్కార్పై చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్: తొమ్మిది నెలల్లో 180 అత్యాచారాలంటూ..!
అమరావతి: రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు, దాడులు కొనసాగుతున్నప్పటికీ..ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. పోలీసు యంత్రాంగాన్ని రాజకీయంగా ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి వినియోగిస్తోందని విమర్శించారు.
దేశానికే తలమానికంలా..: పోలీస్ ట్విన్ టవర్స్కు భారీగా బడ్జెట్: చెప్పినదాని కంటే ఎక్కువే..
నిందితులందరూ వైసీపీ వాళ్లే..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రబాబు ఆదివారం జగన్ సర్కార్ పనితీరును ఎండగడుతూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి తొమ్మిది నెలల్లో 180 మంది మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకున్నాయని, వారిలో 33 మంది చిన్నపిల్లలు ఉన్నారని అన్నారు. అత్యాచార బాధితుల్లో దళితులు, బడుగు, బలహీన వర్గాల వారే అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అధికార మదంతో అత్యాచారాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
మహిళల ఆనందం కోసమే పనిచేశాం..
తమ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు చోటు చేసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. మహిళలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందనే లక్ష్యంతో పని చేాశామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళల ప్రగతి, ఆనందమే లక్ష్యంగా పరిపాలించామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన అమరావతి ఉద్యమాన్ని గురించి ప్రస్తావించారు.
అమరావతి మహిళలకు అన్నీ అవమానాలే..
రాజధాని అమరావతి కోసం 82 రోజులుగా మహిళలు దీక్షలు చేస్తున్నారని, వారిని ప్రభుత్వం తీవ్ర అవమానాలకు గురి చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. అరెస్టులు, లాఠీదెబ్బలను రాజధాని ప్రాంత మహిళలు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. అర్హులైన మహిళలు, వయోధిక వృద్ధుల రేషన్ కార్డులు, పింఛన్లను తొలగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల సహనాన్ని అలుసుగా తీసుకుంటే, ఈ ప్రభుత్వం వారి నుంచి గుణపాఠం నేర్చుకోక తప్పదని హెచ్చరించారు. మహిళలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.