చిరంజీవికి మాజీ సీజేఐ ఎన్వీ రమణ లేఖ..!!
మెగాస్టార్ చిరంజీవి సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ లేఖ రాసారు. జాతీయ స్థాయిలో తెలుగు ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి ఎంపిక కావటం పట్ల అభినందనలు తెలిపారు. తెలుగు సినీ రంగం గర్వించదగిన శిఖర సమాన కళాకారుల్లో చిరంజీవి ఒకరుగా పేర్కొన్నారు. కళామతల్లికి ఆయన సేవలు మహోన్నతం. చిరంజీవికి లభించిన పురస్కారం తెలుగు సినీ రంగానికి గర్వకారణమని ఎన్వీ రమణ ప్రశంసించారు.
స్వయంకృషితో అత్యున్నత శిఖరాలకు
సినీ రంగంలో చిరంజీవి స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను అధిరోహించారని అభినందించారు. చిరంజీవికి అత్యున్న పురస్కారం లభించటం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని జస్టిస్ రమణ పేర్కొన్నారు. చిరంజీవికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇప్పటికే చిరంజీవికి ఈ పురస్కారం దక్కటం పైన ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు పలువురు అభినందించారు. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి వంటి వారు ట్వీట్ల ద్వారా చిరంజీవిని అభినందించారు. చిరంజీవి సినీ రంగానికి అందించిన సేవలను ప్రశంసించారు. పలువురు సీనీ రంగ ప్రముఖులు సైతం మెగాస్టార్ ఈ పురస్కారానికి ఎంపిక కావటం పట్ల హర్షం వ్యక్తం చేసారు.
చిరంజీవికి ప్రముఖుల ప్రశంసలు
మంచు మోహన్ బాబు సైతం చిరంజీవిని అభినందించారు. చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్..అన్నయ్య కు అవార్డు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేసారు.ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు కింద పురస్కార గ్రహీతకు నెమలి బొమ్మ కలిగిన రజత పతకం, రూ.10 లక్షల నగదు, ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఈ అవార్డును గతంలో వహీదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్, సలీమ్ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్ జోషిలు అందుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్నారు.
ప్రత్యేకంగా లేఖ ద్వారా మాజీ సీజేఐ అభినందనలు
టీడీపీ అధినేత చంద్రబాబు సైతం తాజాగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. ఇలా.. సినీ - రాజకీయ రంగంతో పాటుగా ఇతర రంగాల ప్రముఖులు చిరంజీవికి పురస్కారం రావటం పట్ల అభినందనలతో ముంచెత్తుతున్నారు. తాజాగా సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మెగాస్టార్ కు లేఖ ద్వారా అభినందనలు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి చిరంజీవిని ఈ అవార్డుకు ఎంపిక చేయటం.. ఇప్పుడు చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల పైన అనేక విశ్లేషణలు కొనసాగుతున్నాయి.