లాక్డౌన్ వల్ల లాభం లేదు: పారిశుద్ధ్యం ప్రధానం..బ్లీచింగ్ పౌడర్: ఇంటికి రూ.5 వేలు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ను ఎదుర్కొనడానికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. లాక్డౌన్ల వల్ల ఏమాత్రం ఉపయోగం లేదని గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. లాక్డౌన్ వల్ల నష్టపోతోన్న వారిని వెంటనే ఆదుకోవాలని అన్నారు. ప్రతి ఇంటికీ 5000 రూపాయల నగదు, రెండు నెలల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని చెప్పారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
కరోనాపై యుద్ధానికి టీడీపీ ఎంపీ భారీగా నిధులు కేటాయింపు: జగన్కు బదులుగా ఆయనకు లేఖ..!
కేంద్రం మార్గదర్శకాలను అనుసరించండి..
మనదేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఇప్పటికే శరవేగంగా విస్తరిస్తోందని,. ప్రాణాంతకంగా మారిందని అన్నారు. ఈ కరోనా వైరస్ ను ఏవిధంగా నియంత్రించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అనేక మార్గదర్శకాలు జారీ చేసిందని, విదేశాలనుంచి వచ్చేవారికి క్వారంటైన్ చేయడం, ఐసొలేషన్ లో పెట్టడం, స్థానికంగా ఈ వైరస్ ఎవరికీ సోకకుండా నిరోధించడం పైనే, ప్రభుత్వాలు పెద్దఎత్తున దృష్టిపెట్టాల్సి ఉందని అన్నారు.
పారిశుద్ధ్యమే ప్రధానం..
ఆసుపత్రులలో ప్రత్యేక ఐసొలేషన్ వార్డులతో సరిపెట్టకుండా, కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో, వార్డులలో పారిశుద్య చర్యలు చేపట్టాలని, పరిసరాలను పరిశుభ్రం చేయాలని సూచించారు. దీనికోసం అవసరమైన బ్లీచింగ్ పౌడర్ వంటి వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలపై అన్నివర్గాల ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. పరిశుభ్రత ప్రాధాన్యతపై అందరినీ చైతన్య పరచాలని వైఎస్ జగన్కు సూచించారు.
ఉపాధికి గండి..
లాక్ డౌన్ చేయడం కోట్లాది ప్రజలపై ప్రభావం చూపడంతో పాటు లక్షలాది పేద కుటుంబాల ఉపాధికి గండి పడిందని, ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉండటం వల్ల అటు ఉపాధిని కోల్పోయి, ఇటు రోజువారీ ఆదాయంలేక నష్టపోతున్నారని చంద్రబాబు చెప్పారు. రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీలు, అసంఘటిత కార్మికుల కుటుంబాల జీవనం దుర్భరమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయిదు వేల నగదు.. ఉచిత రేషన్..
విపత్తులు సంభవించినప్పుడు బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత అని, ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి రెండు నెలలకు సరిపడా రేషన్ బియ్యం, పప్పులు, వంట నూనె, చక్కెర, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను అందజేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయడంతో పాటు, ప్రతి పేద కుటుంబానికి అయిదు వేల నగదు మొత్తాన్ని ఏమాత్రం జాప్యం చేయకుండా అందజేయాలని ఆయన పేర్కొన్నారు.
Recommended Video
బ్లాక్ మార్కెటింగ్ భారీగా..
బహిరంగ మార్కెట్ లో నిత్యావసరాలు అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు పెరిగిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే కూరగాయల ధరలను భారీగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయని, రైతు బజార్లలో చౌక ధరలకు కూరగాయలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దళారుల బెడదకు అడ్డుకట్ట వేయాలని అన్నారు.