రంగరాజన్కు మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శ..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ ను పరామర్శించారు. రంగరాజన్కు ఫోన్ చేసి దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలానే రంగరాజన్ యోగక్షేమాలు గురించి ఆరా తీశారు. ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి చేయడం బాధాకరం అన్నారు.
మరోవైపు ఈ ఘటనపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన రంగరాజన్ కి ఫోన్ చేసి పరామర్శించారు. ఈ ఘటన ఎలా జరిగింది అన్న దానిపైన సీఎం ఆరా తీశారు. అనంతరం దాడి చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

అలానే దాడి ఘటనపై చిలుకూరు పూజారి రంగరాజన్ ను కేటీఆర్ సైతం పరామర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆయనతో ఫోన్లో మాట్లాడినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రంగరాజన్ క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నానని రాసుకొచ్చారు. అవసరమైన సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్టు బండి సంజయ్ వెల్లడించారు.
ఎలా జరిగిందంటే..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలజీ ఆలయం సమీపంలోని రంగరాజన్ నివాసానికి వచ్చిన పలువురు వ్యక్తులు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరడం... అందుకు ఆయన నిరాకరించడం.. ఆ తర్వాత రంగరాజన్తో పాటు ఆయన కుమారుడిపై దాడి చేయడం.. ఆ వీడియో కాస్త వైరల్గా మారడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
రామ రాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కోరారని.. అందుకు రంగరాజన్ నిరాకరించడంతో తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని ఆయన తండ్రి సౌందర్ రాజన్ పోలీసులకు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు జరిపామని చెప్పారు. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications