ఎంత చెప్పినా తక్కువే- వలంటీర్లపై అంబటి రాయుడు
గుంటూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వలంటీర్లపై చేసిన ఆరోపణల దుమారం తగ్గట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు రెండోరోజూ రోడ్డెక్కారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆయన ఫొటోలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకూ వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరించారు.
మానవ అక్రమ రవాణాకు వలంటీర్లు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ విమర్శించిన విషయం తెలిసిందే. మలిదశ వారాహి యాత్ర సందర్భంగా ఏలూరు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వలంటీర్లను తప్పుపట్టారు. రాష్ట్రంలో 17 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని, వారు అదృశ్యం కావడానికి వలంటీర్లే కారణమంటూ ఆరోపించారు.

ఈ పరిణామాల మధ్య టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించారు. వలంటీర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వలంటీర్ల వ్యవస్థ లేదని చెప్పారు. ఇలాంటి ఓ వ్యవస్థను అమలులోకి తీసుకుని రావడం అనేది ఓ గ్రేట్ ఐడియాగా అభివర్ణించారు. రాష్ట్రానికి ఇదొక ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ అంటూ ప్రశంసించారు.
కొద్దిరోజులుగా తాను జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తోన్నానని, చాలామందితో మాట్లాడానని, ప్రతి ఒక్కరూ వలంటీర్ల గురించి, ఈ వ్యవస్థ గురించి గొప్పగా చెప్పారని అంబటి రాయుడు అన్నారు. సమాజంలో అర్హత గల చిట్టచివరి వ్యక్తికీ సంక్షేమ పథకాలను అందజేయడంలో వలంటీర్లు అత్యంత కీలక పాత్రను పోషిస్తోన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇదో గొప్ప అఛీవ్మెంట్గా పేర్కొన్నారు.
కరోనా సమయంలో వలంటీర్లు చేసిన సేవలను ఎవ్వరూ విస్మరించలేనిదని అంబటి రాయుడు చెప్పారు. కరోనా కష్టకాలంలో వలంటీర్ల సేవలను జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వలంటీర్ల గురించి ఎంత మంచిగా చెప్పినా తక్కువే అవుతుందని వ్యాఖ్యానించారాయన.
పవన్ కల్యాణ్.. వలంటీర్లపై చేసిన విమర్శలను పరోక్షంగా తప్పుపట్టారు అంబటి రాయుడు. మంచి పనులు చేస్తోన్నప్పుడు బురద జల్లడం సహజమేనని, వాటిని పెద్దగా పట్టించుకోకూడదని చెప్పారు. ఓ మంచి పని చేస్తోన్నప్పుడు, సమాజంలో నలుగురికి చేతనైనంత సహాయం చేస్తోన్నప్పుడు.. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ముందుకు వెళ్లడమే తప్ప వెనకడుగు వేయకూడదని అన్నారు.












Click it and Unblock the Notifications