ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శికి కీలక బాధ్యతలను అప్పగించిన వైఎస్ జగన్..!!
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన డాక్టర్ సమీర్ శర్మ పదవీ విరమణతో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆరుమంది సీనియర్ ఐఎఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. మొన్నటివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి- చీఫ్ సెక్రెటరీగా నియమితులు అయ్యారు. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారిణి డాక్టర్ పూనం మాలకొండయ్య అపాయింట్ అయ్యారు.
ఈ ముగ్గురు కొద్ది సేపటి కిందటే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. మర్యాదపూరకంగా ఆయనతో భేటీ అయ్యారు. కేెఎస్ జవహర్ రెడ్డితో సుమారు అరగంటకుపైగా మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడం వల్ల పరిపాలనపరంగా ప్రభుత్వంపై ఎలాంటి రిమార్కులు రాకుండా బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందని కోరారు.

1990 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి జవహర్ రెడ్డి. 2024 జూన్ 30వ తేదీ వరకు సర్వీసులో ఉంటారు. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య శాఖల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక అధికారిగా పని చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

డాక్టర్ సమీర్ శర్మ పదవీ విరమణ తరువాత పూనం మాలకొండయ్య, వై మధుసూధన్ రెడ్డి, ప్రవీణ్ ప్రకాష్, బీ రాజశేఖర్, బీ మహ్మద్ దివాన్ మైదీన్లకు స్థానచలనం కలిగింది. కాగా- డాక్టర్ సమీర్ శర్మతోనూ వైఎస్ జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయన చేసిన సేవల పట్ల ప్రశంసించారు. ఈ భేటీ ముగిసిన తరువాత ముఖ్యమంత్రి కార్యాలయం ఆయనకు తీపి కబురు వినిపించింది.

సమీర్ శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్గా అపాయింట్ చేసింది. దీనితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ ఎగ్జిక్యూటివ్గా నియమించింది. సమీర్ శర్మ కోసం ఈ హోదాను సృష్టించింది ప్రభుత్వం. తొలుత- సమీర్ శర్మను రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫిషియో ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందంటూ వార్తలొచ్చాయి. దీనికి బదులుగా ప్రభుత్వం రెండు పోస్టులను ఆయనకు అప్పగించింది. ఏపీ పీసీబీ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ టు సీఎంగా అపాయింట్ చేసింది.












Click it and Unblock the Notifications