Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IT Employee: 26 చోరీల వెనుక ఐటీ మైండ్! పోలీసులు షాక్

రాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్న కాలనీలు... తాళాలు వేసిన ఇళ్లు... తెల్లవారితే కనిపించని బంగారం, నగదు.
ఈ దొంగతనాల వెనుక ఎవరో అనుభవజ్ఞుడైన నేరగాడే ఉంటాడని పోలీసులు భావించారు. నెలల తరబడి సాగిన దర్యాప్తు చివరకు బయటపెట్టిన నిజం మాత్రం అందరినీ షాక్‌కు గురిచేసింది. విశాఖపట్నం, ఏపీ వ్యాప్తంగా వరుస చోరీలకు పాల్పడింది ఓ 27 ఏళ్ల మాజీ ఐటీ ఉద్యోగి అని తేలింది.

విలాసవంతమైన జీవితం కోసం నేరబాట పట్టిన అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీని విశాఖ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇప్పుడు వరుస దొంగతనాల కేసుల్లో ప్రధాన నిందితుడిగా మారడం అధికారులనే ఆశ్చర్యానికి గురిచేసింది. కాకినాడకు చెందిన సన్నీ, ప్రస్తుతం విశాఖలోని మాధవధార ప్రాంతంలో నివసిస్తున్నాడు.

IT employee

బీఎమ్‌డబ్ల్యూ కారు, ఖరీదైన గాడ్జెట్లు, విదేశీ ప్రయాణాలు... ఇవన్నీ తనకు కావాలన్న ఆశే అతడిని నేర ప్రపంచంలోకి నెట్టిందని పోలీసులు చెబుతున్నారు. ఉన్నత చదువు, మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ, త్వరగా డబ్బు సంపాదించాలనే లోభమే అతడిని వరుస చోరీలకు పాల్పడేలా చేసిందని విచారణలో వెల్లడైంది.

మొత్తం 1,084 గ్రాముల బంగారం..

సన్నీ అరెస్టుతో విశాఖ నగర పరిధిలోని గాజువాక, అరిలోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ ప్రాంతాల్లో జరిగిన 26 ఇంటి దొంగతనాల కేసులు క్లోజ్ అయ్యాయి. ఈ కేసుల్లో మొత్తం 1,084 గ్రాముల బంగారం, 6,300 గ్రాముల వెండి, రూ.40,500 నగదు చోరీ అయినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం ఆస్తి విలువ రూ.24.66 లక్షలుగా అంచనా వేశారు.

అరెస్టు సమయంలో సన్నీ వద్ద నుంచి 699 గ్రాముల బంగారం, 3.8 కిలోల వెండి ఆభరణాలు, దొంగతనం డబ్బుతో కొనుగోలు చేసిన లగ్జరీ బీఎమ్‌డబ్ల్యూ కారు, నంబర్ లేని స్కూటర్‌తో పాటు చోరీలకు ఉపయోగించే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ రూ.15.63 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.

15 ఏళ్ల వయసులోనే చోరీ..

విశాఖపట్నం పోలీసు కమిషనర్ శంకా బ్రత బాగ్చి వెల్లడించిన వివరాల ప్రకారం, సన్నీ నేర ప్రవృత్తి కొత్తది కాదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే చోరీ కేసులో పీఎం పాలెం పోలీసులకు చిక్కి, జువైనల్ హోమ్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి విడుదలైన తరువాత కూడా అతడి తీరు మారలేదు. కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ చివరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో 14 నెలలు శిక్ష అనుభవించాడు.

పోలీసు రికార్డుల ప్రకారం, సన్నీపై రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయి. ఇళ్లలోకి ప్రవేశించేందుకు అతడు మాస్క్‌లు, టోపీలు, చేతి తొడుగులు ధరించడమే కాకుండా, సుత్తులు, స్క్రూడ్రైవర్లు, డ్రిల్లింగ్ మెషిన్ల వంటి ఆధునిక పరికరాలను ఉపయోగించేవాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం సన్నీపై సంబంధిత అన్ని కేసుల్లోనూ అభియోగాలు నమోదు చేస్తూ, ప్రాసిక్యూషన్ కోసం ఛార్జ్‌షీట్లను సిద్ధం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉన్నత చదువు, అవకాశాలు ఉన్నా తప్పు దారిలోకి వెళ్తే చివరకు చీకటే మిగులుతుందనే హెచ్చరికగా ఈ కేసు నిలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+