అవినీతిపై ప్రశ్నిస్తే రాద్దాంతం చేస్తారా: చంద్రబాబు అండ్ కో పై ఆ మాజీ జస్టిస్ ధ్వజం
అమరావతి: అభివృద్ధి ముసుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచ్చలవిడిగా దోచుకుందని ధ్వజమెత్తారు రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో విపరీతంగా దోచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. వీటన్నిటి లెక్కలు జగన్ బయటపెడుతుంటే తప్పయి పోయిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి చిట్టాను బయటపెడుతుంటే ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోందని విమర్శించారు. విచారణ కమిటీలు, విజిలెన్స్ దర్యాప్తులు వేస్తుంటే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పిన జస్టిస్ ఈశ్వరయ్య... ఇంటి యజమానే దొంగతనం చేసి తన ఇంట్లో దొంగలు పడ్డారన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.
Recommended Video
దొంగలు పడి దోచుకుపోతే వారెంత దోచుకెళ్లారో చెప్పడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. సీఎం జగన్ కూడా అదే చేస్తున్నారని జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు. ఇలా ప్రశ్నించడం అదేదో పెద్ద తప్పయినట్లు ఓ వర్గం మీడియా గగ్గోలు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ ఈశ్వరయ్య పనిగట్టుకుని జగన్ ప్రభుత్వంపై బురద జల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మీడియా వ్యవహరిస్తున్నతీరుపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.
జగన్ ప్రభుత్వం చారిత్రాత్మక బిల్లులు పాస్ చేయించి చరిత్రలో నిలిచిపోయిందని జస్టిస్ ఈశ్వరయ్య కొనియాడారు. నిధులు నియామకాల్లో వెనకబడిన తరగతుల వారికి, ఎస్సీ ఎస్టీ, మైనార్టీలకు , మహిళలకు 50 శాతం కేటాయిస్తూ ఎవరూ తీసుకోలేని సాహసోపేతమైన నిర్ణయంను జగన్ తీసుకున్నారని జస్టిస్ ఈశ్వరయ్య ప్రశంసించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించిన ఏకైక నాయకుడు వైయస్ జగన్ అని తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఇక పారదర్శకతలో దేశంలో ఏ ప్రభుత్వం జగన్ సర్కార్ ముందు నిలవలేదని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు.