హైకోర్టుకెక్కిన అంబటి రాంబాబు
Ambati Rambabu: అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక ఎక్స్ హ్యాండిల్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. అందులో పోస్ట్ అవుతున్న సమాచారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్యల కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు.
పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు నాయకులపై తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ నుంచి చాలా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని, వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో ఆయన హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది.

టీడీపీ అధికారిక ఎక్స్ అకౌంట్లో అనుచిత పోస్టుల వ్యవహారంలో కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని అంబటి రాంబాబు తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. అందులో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, జగన్ను కించపరిచేలా, వ్యక్తిత్వ హననం చేస్తోన్నారని విమర్శించారు.
తనతో పాటు కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం సాగిస్తోన్నారని అంబటి రాంబాబు ఈ పిటీషన్లో వివరించారు. తాము ఇదివరకే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని, లిఖితపూరకంగా ఫిర్యాదు నమోదు చేశామని హైకోర్టుకు వివరించారు.
అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై వివక్ష ప్రదర్శిస్తోన్నారని అంబటి రాంబాబు పిటిషన్లో పేర్కొన్నారు. తన పిటిషన్ ఆధారంగా చేసుకుని ఐటీడీపీపై కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలను ఇవ్వాలని ఆయన కోరారు.
తాము ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారో లేదో కూడా తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారాయన. తాము ఇచ్చిన ఫిర్యాదులపై కాలయాపన చేయడం సరికాదని అంబటి అన్నారు. ఏకపక్షంగా వ్యవహరించకుండా నిష్పక్షపాతంగా పని చేయాలంటూ గతంలో పోలీసులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని అంబటి రాంబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications