వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ మంత్రి: సొంతగూటికి సిట్టింగ్ ఎమ్మెల్యే: ఇద్దరికీ హ్యాండిచ్చిన టీడీపీ..
హైదరాబాద్/ఒంగోలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులు మళ్లీ సొంత గూటికి రావడం కొనసాగుతోంది. ఇదివరకు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వంటి నాయకులు వైఎస్ఆర్ సీపీలో చేరగా.. తాజాగా కొత్తపల్లి సుబ్బారాయుడు, డేవిడ్ రాజు పార్టీ కండువాను కప్పుకొన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు మంగళవారం ఉదయం హైదరాబాద్ లో లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి, పార్టీలో చేరారు. డేవిడ్ రాజు.. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో బాలినేని శ్రీనివాస రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం పార్టీలో చేరారు.
ఇద్దరికీ హ్యాండిచ్చిన టీడీపీ..
నిజానికి- వారిద్దరి రాజకీయ మూలాలు తెలుగుదేశం పార్టీలోనివే. కొత్తపల్లి సుబ్బారాయుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడు కూడా. కొత్తపల్లి.. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో అదే పార్టీలో ఆయనా కొనసాగారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిపోయారు. అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనను కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు చంద్రబాబు.
వచ్చే ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని కొత్తపల్లి ఆశించారు. దీనికి అవసరమైన ఏర్పాట్లును పూర్తి చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆయనకు బదులుగా శివరామరాజుకు టికెట్ ఇచ్చింది టీడీపీ. దీనితో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లో జగన్ ను కలిసి వైఎస్ఆర్ సీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
టికెట్ ఇస్తామని నమ్మించి..
ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజుది కూడా దాదాపు ఇదే పరిస్థితి. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఎర్రగొండ పాలెం నుంచి పోటీ చేసి, విజయం సాధించారాయన. అనంతరం తెలుగుదేశంలో పార్టీకి ఫిరాయించారు. టికెట్ ఖాయమని చంద్రబాబు భరోసా ఇవ్వడంతోనే తాను పార్టీ ఫిరాయించినట్లు డేవిడ్ రాజు పలుమార్లు చెప్పుకొన్నారు కూడా. తీరా ఎన్నికలు దగ్గరికొచ్చే సరికి.. మోసపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన సంతనూతలపాడు టికెట్ ను ఆశించారు.
చివరి నిమిషంలో డేవిడ్ రాజుకు షాక్ ఇచ్చారు చంద్రబాబు. ఆయనకు బదులుగా పాతకాపు బీ విజయ్ కుమార్ ను బరిలో దింపారు. దీనితో ఆగ్రహించిన డేవిడ్ రాజు.. తిరుగుబాటు అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు కూడా. అయినప్పటికీ- మంగళవారం ఉదయం ఆయన ఒంగోలులో ఆయన మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. డేవిడ్ రాజుతో పాటు పలువురు అభిమానులు, అనుచరులు కూడ వైఎస్ఆర్ సీపీలో చేరారు. జిల్లాలో దళిత అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో ప్రచారం చేస్తానని డేవిడ్ రాజు తెలిపారు. వారి విజయానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. చంద్రబాబు నాయుడు దళితులను మోసగించారని విమర్శించారు.