నెల్లూరులో టీడీపీని చావుదెబ్బ కొడుతున్న మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఏం చేస్తున్నారంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగుతున్నారు. ఈసారి ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా నెల్లూరు సిటీ లో మళ్లీ ఎన్నికలలో విజయం సాధించి సత్తా చాటాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ పై ఫోకస్ పెట్టారు. ఒకప్పుడు బలమైన ప్రత్యర్థిగా ఉన్న, మాజీ మంత్రి నారాయణ, ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ గా లేకపోయినా, తాను మాత్రం బలం పుంజుకోవడానికి ఇప్పటి నుంచే వడివడిగా అడుగులు వేస్తున్నారు. తనకు ప్రత్యర్ధిగా పోటీలో ఎవరు ఉన్నా దీటుగా ఎదుర్కొనేలా వ్యూహాలు రచిస్తున్నారు.

నెల్లూరు సిటీపై ఫోకస్ పెట్టిన అనిల్ కుమార్ యాదవ్
మంత్రి పదవిలో ఉన్నప్పుడు నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేక పోయిన అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవి పోయాక ప్రస్తుతం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, నెల్లూరు సిటీ నియోజక వర్గానికే పరిమితమై పనిచేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రధానంగా దృష్టి సారించారు. 2019లో అప్పటి మంత్రి నారాయణపై అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన అనిల్ కుమార్ యాదవ్, వచ్చే ఎన్నికలలో అటువంటి గడ్డు పరిస్థితులు ఉండకుండా క్లీన్ స్వీప్ చేయడం కోసం ఇప్పటి నుంచే పనిచేస్తున్నారు.

మళ్ళీ నారాయణకే టీడీపీ టికెట్? వ్యూహాత్మకంగా అనిల్ కుమార్ యాదవ్
ఈసారి కూడా వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణ, అనిల్ కుమార్ యాదవ్ కు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో ఉండే అవకాశం ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం నెల్లూరు సిటీ లో మాజీ మంత్రి నారాయణ ప్రభావం బాగా తగ్గింది. పార్టీ కార్యక్రమాలలో నారాయణ పాల్గొన్న దాఖలాలు లేవు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న పరిస్థితులు అంతకంటే లేవు. అయినప్పటికీ ఎన్నికల సమయానికి నారాయణ టిడిపి టికెట్ తో వచ్చి, రాజకీయంగా చక్రం తిప్పుతారని అనుమానం ఉన్న క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటినుంచే వ్యూహాలతో రెడీ అవుతున్నారు.

చేరికలను ప్రోత్సహిస్తున్న అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు సిటీలో పార్టీని బలోపేతం చేస్తే తనకు విజయం ఖాయమని భావిస్తున్నారు. గతంలోలా తనకు ఈ సారి గట్టిపోటీ ఉండబోదని భావిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, స్థానికంగా తాము చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తాయని నమ్ముతున్నారు. అంతే కాదు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యర్థి పార్టీలలో బలంగా ఉన్న నాయకులపై దృష్టిసారించిన అనిల్ కుమార్ యాదవ్ చేరికలను ప్రోత్సహిస్తున్నారు.

నెల్లూరు సిటీలో వీకైన టీడీపీని మరింత వీక్ చేసే పనిలో అనిల్ కుమార్ యాదవ్
తాజాగా అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు దాదాపు 100 మంది చేరినట్లుగా సమాచారం. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కనుపూరు సురేష్ వర్ధన్ రెడ్డి, తన అనుచరులతో కలిసి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు సిటీలో టిడిపిని బలహీనం చేయడం పనిగా పెట్టుకున్న అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం లక్ష్యంగా పని చేస్తున్నారు. నెల్లూరు సిటీలో టిడిపి నారాయణ యాక్టివ్ గా లేకపోవడంతో వీక్ అయ్యింది. ఇక దానిని మరింత వీక్ చేసే పనిలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ టీడీపీని చావుదెబ్బ కొడుతున్నారు.












Click it and Unblock the Notifications