ఇంత నీఛ రాజకీయాలా .. వైసీపీ సర్కార్ ను లెక్కలడిగి కడిగేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ
కరోనా ఏపీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే రాజకీయాలు చెయ్యటం సరైనది కాదని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రపంచమంతా కరోనాపై సమిష్టిగా పోరాడాల్సిన సమయంలో అది పక్కన పెట్టి వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్నారు . ఒక పక్క లాక్ డౌన్ తో పనులు లేక, తినటానికి తిండి లేక ప్రజలు కష్టపడుతుంటే కరోనా సమయంలోనూ వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలను మభ్యపెడుతున్నారని భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు .

ఏపీ సర్కార్ ఆ వెయ్యి రూపాయలు ఇస్తే కేంద్రనిధులు ఏమైనట్టు ?
రాష్ట్రంలో పేద ప్రజలకు ఆర్ధిక సాయం అందించింది కేంద్రం అని , సీఎం జగన్ కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇక వెయ్యి రూపాయలు కేంద్రం కాదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్యేలు అబద్ధాలు చెబుతున్నారని ఆమె మండి పడ్డారు . ఒకవేళ ఏపీలో ప్రభుత్వమే ఆ వెయ్యి రూపాయలు ఇచ్చుంటే కేంద్రం ఇచ్చిన 2 వేల 354 కోట్ల రూపాయలు ఏమైన్నట్టు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ నిలదీశారు . ఏపీకి ఏం ఇచ్చిందీ స్వయంగా కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ ట్విట్టర్ లో పేర్కొన్నారని ఆమె తెలిపారు .

నీచమైన రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులంటూ భూమా నిప్పులు
14వ ఆర్థిక సంఘం కింద పంచాయితీలకు 870 కోట్లు, మున్సిపాలిటీలకు 432 కోట్ల రూపాయలు, రెవెన్యూ లోటు భర్తీ కింద 450 కోట్లు, విపత్తుల సంఘం కింద 560 కోట్లు ఇచ్చారు. మొత్తంగా 2,354 కోట్లు వస్తే ఎక్కడా కూడా దీన్ని బయటకు రానీయకుండా ఆ డబ్బు మేమే ఇస్తున్నామని వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఇలాంటి సమయంలో రాజకీయాలు అవసరమా అని ఆమె పేర్కొన్నారు . ఇక వెయ్యి రూపాయలు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నారు. ఇంతకంటే నీచమైన రాజకీయం ఉంటుందా? అని ఆమె మండిపడ్డారు .

వైసీపీ అధికారంలో ఒక్క ఏడాదిలో 72 వేల కోట్ల అప్పు
వైద్యులు, అధికారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తున్నారని, ఇక ప్రతిపక్షాల మీద నోరు పారేసుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కరోనా నియంత్రణ కోసం ఏపీలో కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని , ప్రతి దానికీ బడ్జెట్ లేదని చేతులెత్తేస్తున్నారు ఎందుకు అని ఆమె నిలదీశారు . టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం 26 వేల కోట్లు అప్పు చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే 72 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని భూమా అఖిల ప్రియ విరుచుకుపడ్డారు.

వైసీపీ హయాంలో రేట్ల పెంపు .. ఆ డబ్బంతా ఏమైంది ?
వైసీపీ హయాంలో సిమెంట్ , బస్, విద్యుత్, ఇసుక, డీజిల్ రేట్లు పెంచేశారని పేర్కొన్న ఆమె రేట్ల పెంపు వల్ల దాదాపు 10 వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. మరి ఈ డబ్బంతా ఏం చేస్తోంది ప్రభుత్వం? అని లెక్క అడిగారు. ఇక అంతే కాదు ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు . ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదు? అని ప్రశ్నించారు . రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము అభ్యర్థించినా పట్టించుకోవడం లేదు అని నిప్పులు చెరిగారు .
Recommended Video

హైకోర్టు చివాట్లు పెడుతున్నా ఏపీ సర్కార్ కు సిగ్గు లేదు
కేంద్రం ఇచ్చిన నిధులు వైసీపీ నేతలు ఇచ్చినట్టు ఫోజులివ్వడమేంటి? అని ప్రశ్నించిన భూమా అఖిల ప్రియ కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ లేదన్నట్టు ప్రభుత్వ తీరు ఉందని ఆరోపించారు . డాక్టర్లు ప్రభుత్వం దృష్టికి తాజా పరిస్థితి తీసుకురావాలంటేనే భయపడుతున్నారని చెప్పారు . హైకోర్టు చివాట్లు పెడుతున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గులేదని ఆమె నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు ఇకనైనా రాజకీయాలు పక్కనపెట్టి ప్రజలను ఆదుకోవాలని , కరోనా నియంత్రణకు చిత్త శుద్దితో పని చెయ్యాలని చెప్పారు భూమా అఖిల ప్రియ .












Click it and Unblock the Notifications