టీడీపీకి దక్కేది ఆ నాలుగు సీట్లే- కొడాలి నాని
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్పై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డాడని, తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని ధ్వజమెత్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి దక్కబోయేది కూడా ఆ నాలుగు సీట్లేనని కొడాలి నాని జోస్యం చెప్పారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కాదని, ఆ గెలుపును నిజాయితీ, నిబద్ధత, విశ్వసనీయతతో సాధించడమేనని తేల్చి చెప్పారు. విలువలతో కూడిన రాజకీయం చేయడానికే ఆయన వచ్చారని, విలువలకే నిలబడ్డాడని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ విదిలించిన ఎంగిలి మెతుకులతో చంద్రబాబు పొట్ట నింపుకున్నాడని విమర్శించారు.
ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజే- ఆయన మనవడు నారా లోకేష్ శాసన మండలి సభ్యత్వ గడువు తీరి పోయిందని, దేవుడి స్క్రిప్ట్ అంటే అదేనని గుర్తు చేశారు. చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ మొత్తం అయిదు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటే- మూడుసార్లు ఓడిపోయిందని చెప్పారు. 1999లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి ఛరిష్మా వల్లే టీడీపీ గెలిచిందని పేర్కొన్నారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిందని చెప్పారు. 2014లో మళ్లీ బీజేపీ దయతో గెలిచిందని వ్యాఖ్యానించారు.

తమ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నాడని, వారిలో ఒక్కడే గెలిచాడని, మిగిలిన 22 మంది షెడ్డుకెళ్లిపోయారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. జగన్ కు అన్యాయం చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరూ దిక్కు, దివాణం లేకుండా పోయారని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను లాక్కున్నాడని, టీడీపీకి ఆ నాలుగు సీట్లే దక్కుతాయని, ఇదే దేవుడి స్క్రిప్ట్ అని చెప్పారు.
తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లో బలాన్ని కోల్పోయారని కొడాలి నాని అన్నారు. వారికి టికెట్లు ఇవ్వొద్దంటూ క్యాడర్తో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటోన్నారని అన్నారు. ఆ నలుగురిని కూడా వేరే రకంగా ఆదరిస్తానని జగన్ హామీ ఇచ్చాడని, అయినా గానీ వారు పట్టించుకోకుండా టీడీపీకి అమ్ముడుపోయారని కొడాలి నాని ధ్వజమెత్తారు. ఆ నలుగురిలో ఇద్దరు బాహటంగా వైసీపీ మీద అసంతృప్తిని వ్యక్తం చేయగా..ఇద్దరు ద్రోహం చేశారని ఆరోపించారు.
ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు వ్యాపార సంస్థగా మార్చేశాడని కొడాలి నాని ఆరోపించారు. పార్టీని అడ్డుగా పెట్టుకుని చంద్రబాబు, ఆయన కుటుంబం లక్షల కోట్ల రూపాయలను దోచుకుందని ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చింది ఎన్టీ రామారావు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని, వారిద్దరి వారసత్వాన్ని ఇప్పుడు వైఎస్ జగన్ పుణికి పుచ్చుకున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications