చంద్రబాబుకు కొడుకుపై నమ్మకం లేదు- నారా లోకేష్ పాదయాత్ర పోస్టర్లో తండ్రి ఫొటో లేదు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరులో నిర్వహించిన సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పేర్నినాని ఘాటుగా స్పందించారు. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో చంద్రబాబు ఆడుతోన్న దుర్మార్గపు రాజకీయ క్రీడకు ముగ్గురు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్లేట్ ఫిరాయింపు..
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ కార్యక్రమం పేరుతోనే టీడీపీ నాయకులు అనుమతులు తీసుకున్నారని, మనుషుల ప్రాణాలు పోయిన తరువాత మాట మారుస్తున్నారని ఆరోపించారు. గుంటూరు తొక్కిసలాట ఘటనతో చంద్రబాబుకు సంబంధం లేదంటూ టీడీపీ నేతలు బుకాయిస్తోన్నారని ధ్వజమెత్తారు. అటు ఎల్లోమీడియా ప్లేట్ ఫిరాయించిందని విమర్శించారు. ఈ తొక్కిసలాటను ఉయ్యూరు ఫౌండేషన్ పైకి నెట్టేస్తోందని మండిపడ్డారు.

టీడీపీ పేరు చెబితే జనం రావట్లేదు..
గుంటూరులో 10 వేల మందికి కానుకల పంపిణీ అంటూ అనుమతులను తీసుకున్న తరువాత, 30 వేల మందికి టోకెన్లు ఇచ్చారని పేర్ని నాని అన్నారు. టీడీపీ పేరు చెబితే జనాలు సభలు, రోడ్ షోలకు రావట్లేదనే కారణంతో స్వచ్చంద సంస్థల ముసుగులో అమెరికా నుంచి ఎవరినో ఒకరిని తీసుకువచ్చి టోకేన్లు పంచిపెట్టి అమాయక జనాలను చంద్రబాబు నాయుడు తన సభలకు తరలిస్తోన్నాడని విమర్శించారు.

కొడుకు మీద నమ్మకం లేదు..
చంద్రబాబుకు తన కొడుకు నారా లోకేష్ మీద నమ్మకం లేదని పేర్ని నాని ఎద్దేవా చేశారు. కొడుకు పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ లో తండ్రి ఫోటో లేదని గుర్తు చేశారు. చంద్రబాబు బతికి ఉండగానే ఆయన ఫోటో లేకుండా నారా లోకేష్ రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పారు. చంద్రబాబుకు దత్త పుత్రుడిపైనే నమ్మకం ఎక్కువ అని, దత్తపుత్రుడేమో బీజేపీతో ఉంటూ చంద్రబాబుకు సైగ చేస్తుంటారని చురకలు అంటించారు.

వ్యక్తిత్వం లేని వారితో పోరు..
ఏ మాత్రం వ్యక్తిత్వం లేనివారితో తాము రోజు పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్ని నాని చెప్పారు. అన్ని పార్టీలు కలిసి వచ్చినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేయలేరని అన్నారు. వైఎస్ జగన్ ను ఓడించడానికి కాదు కదా- కనీసం ఎన్నికల్లో నిలబెట్టే అభ్యర్థులకు మనో ధైర్యం ఇవ్వడానికైనా అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అన్నారు. ఇన్ని పార్టీలు పొత్తు పెట్టుకుంటే గానీ వారికి అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదని, ఈ విషయం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు బాగా తెలుసని చెప్పారు.

అంగుళం కూడా కదపలేరు..
ఎంత మంది, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా వైఎస్ జగన్ ను అంగుళం కూడా కదపలేరని పేర్ని నాని తేల్చి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి ఏపీలో విస్తరించడంపై పేర్ని నాని స్పందించారు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని వ్యాఖ్యానించారు. ఏపీలో బీఆర్ఎస్ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా ఉండబోదని, ఆ పార్టీ కాంగ్రెస్తో పోటీ పడుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications