హరిరామ జోగయ్యకు టోపీ పెట్టిన పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. ఆయన రాజకీయం అంతా కాపుల కోసం కాదని, చంద్రబాబును సీఎంగా చేయడానికేనంటూ ఆరోపించారు.
అమరావతి: కాపు నాయకుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలు చేసేది కాపులు, బీసీల కోసం కాదని, చంద్రబాబు కోసమేనని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే పవన్ కల్యాణ్ వీకెండ్ రాజకీయాలు చేస్తోన్నాడని విమర్శించారు. రాజకీయాల్లో విశ్వసనీయతను కోల్పోయారని చెప్పారు.
ఇవ్వాళ ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుులతో మాట్లాడారు. రాజకీయాల్లో ఆస్కార్ అవార్డు ఉంటే అది పవన్ కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. కాపుల ఆత్మాభిమానం తగ్గకుండా ఒప్పందాలు చేసుకుంటానని పవన్ చెబుతున్నాడని దానికి అర్థమేమిటని ప్రశ్నించారు. అలుపు సొలుపు లేకుండా 2014 నుంచి చంద్రబాబుకు ఊడిగం చేస్తోన్నారని ధ్వజమెత్తారు.
కాపుల కోసం నిలిచిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కడేనని, ఆయన ప్రభుత్వాన్ని దింపేయాలని పవన్ కల్యాణ్ చూస్తోన్నాడని విమర్శించారు. కాపులు 2019లోనే కాదు.. 2024, 2029 ఎన్నికల్లో కూడా తమ పార్టీకే మద్దతు ఇస్తారని పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ను కాపులు గెలిపిస్తారని అన్నారు. సోషల్ ఇంజినీరింగ్ గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ కు ఏ కులం ఏ జాబితాలో ఉందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.
ఏదో ఉద్ధ్దరిస్తాడని ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ను నమ్ముకున్న ఎందరో నాయకులు తమ నెత్తిన టోపీ పెట్టించుకున్నారని పేర్ని నాని అన్నారు. హరిరామజోగయ్యకు కూడా పెద్ద టోపీ పెట్టాడని చెప్పారు. హరిరామజోగయ్యను చూస్తే తనకు జాలేస్తోందని వ్యాఖ్యానించారు. ఒక పక్క తాను ముఖ్యమంత్రి కాకూడదని పవన్ అంటుంటే.. ఆయనే సీఎం కావాలని హరిరామజోగయ్య చెబుతున్నాడని గుర్తు చేశారు.

భీమవరం, గాజువాకలో తన కులపోళ్లు ఓటేస్తే ఓడిపోయే వాడ్ని కాదని పవన్ చెబుతున్నాడని, ఒక కులం ఓటుతో శాసన సభలోకి అడుగు పెట్టాలనుకునే నీచ మనస్తత్వం పవన్ కల్యాణ్ దని అన్నారు. చంద్రబాబు రాజకీయాల కోసమే ఇంత నీచానికి దిగజారి మాట్లాడుతున్నాడని పేర్నినాని ఆరోపించారు. చంద్రబాబు ప్రాపకం కోసం కాపులు, బలిజల చేతుల్లో ఉన్న గనులను వైఎస్ కుటుంబం లాక్కుందని విషం చిమ్మటం పవన్ నీచ రాజకీయానికి నిదర్శనమని మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ కు ఎలాంటి సిద్ధాంతాలు లేవని, నిలకడ లేని రాజకీయాలు చేస్తోన్నాడని పేర్ని నాని విమర్శించారు. కాపుల గురించి కలవరించే పవన్ కల్యాణ్ వారికి నువ్వేం చేశావని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ పంచన ఉండి కాపుల రిజర్వేషన్ కోసం ఎవరితోనైనా మాట్లాడావా? అని నిలదీశారు. అందుకు ఏ ప్రయత్నం చేశావని కాపులు నిన్ను నమ్మాలని అన్నారు.












Click it and Unblock the Notifications