కేంద్రం గెజిట్ తో పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టయ్యిందన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న జల వివాదాల నేపథ్యంలో కేంద్రం తాజాగా జారీ చేసిన గెజిట్ పై ఏపీ , తెలంగాణ రాష్ట్రాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేంద్రం గెజిట్ పై పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతనే స్పందిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో వైసిపి దీనిపై తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని కూడా విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తానని చంద్రబాబు చెప్పారు.
అధికార వైసీపీ కేంద్రం ఇచ్చిన గెజిట్ ను స్వాగతిస్తున్నామని పైకి చెప్పినా ముందు ముందు ఎలాంటి నష్టం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉంది. కక్కలేని మింగలేని పరిస్థితిలో ఉంది. ఇదిలా ఉంటే కేంద్రం విడుదల చేసిన గెజిట్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య బంధాలు, అనుబంధాలు, బంధుత్వాలు, స్నేహాలు సజీవంగా ఉన్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల తీరుతోనే కేంద్రం పెత్తనం చేజిక్కించుకుందని ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇద్దరు సీఎంల మూర్ఖత్వంతోనే కేంద్ర ప్రభుత్వం మన నీళ్ళ మీద పెత్తనం దక్కించుకుందని ఆయన ఆరోపించారు. మన సీఎంలు కట్టిన ప్రాజెక్టులకు మన ఇంజనీర్లు వెళ్లాలంటే సిఐఎస్ఎఫ్ బలగాల అనుమతి కావలసిన దుర్గతి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన గెజిట్ తో పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు అయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.