ఒకే కారులో ఇద్దరు నానీలు..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇవ్వాళ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో భేటీ అయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందని, ఆ తరువాత పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకుని ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని పేర్కొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకోవాల్సి ఉంటుందంటూ వైఎస్ జగన్- పార్టీ నాయకులందరికీ లక్ష్యాన్ని నిర్దేశించిన నేపథ్యంలో ఈ వర్క్షాప్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారాయన. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకోవాలని, ప్రతి గ్రామానికీ వెళ్లాలని ఆదేశించారు. ప్రతి ఇంటినీ పలకరించాలని సూచించారు. అలా చేసిన శాసన సభ్యులకే భవిష్యత్ ఉంటుందనే సంకేతాన్నీ పంపించారాయన.
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి ఉన్న 150 మంది శాసనసభ్యులు దీనికి హాజరయ్యారు. 26 జిల్లాల అధ్యక్షులు, రీజియన్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలతో వైఎస్ జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గ్రామ/వార్డు సచివాలయాల కన్వీనర్లుగా ఎమ్మెల్యేలు తమకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చని పేర్కొన్నారు. వలంటీర్లను గృహసారథులుగా వినియోగించుకోకూడదనే నిబంధన విధించారు.
మరో ఏడాదిన్నర కాలంలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్ నిర్వహించిన ఈ వర్క్షాప్కు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. దీనికి హాజరు కావడానికి పౌర సరఫరాలు, రవాణా శాఖ మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరూ ఒకే కారులో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకోవడం ఆకర్షించింది. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన నాయకులు.
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం నియోజకవర్గానికి పేర్ని నాని ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. అదే జిల్లాలోని గుడివాడ నుంచి కొడాలి నాని ఎన్నికయ్యారు. తరచూ విలేకరుల సమావేశాలను నిర్వహిస్తూ- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై ఎదురుదాడికి దిగుతుంటారు. వైఎస్ జగన్కు అత్యంత నమ్మకస్తులైన నాయకుల్లో వారూ ఉన్నారు. వైఎస్ జగన్పై రాజకీయ ప్రత్యర్థులు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. దాన్ని వెంటనే తిప్పికొడుతుంటారు కొడాలి నాని, పేర్ని నాని.