పేకాట: మాజీ ఎమ్మెల్యే నానిని అరెస్ట్, బైక్ రేస్.. పోలీసులకే హెచ్చరిక
హైదరాబాద్/విజయవాడ: హైదరాబాద్ పంజాగుట్టలోని హరిత ప్లాజాపై ఆదివారం వేకువజామున సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5లక్షల నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారిలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే నాని కూడా ఉన్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం టిడిపి ఇంఛార్జిగా ఆయన ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.
అర్థరాత్రి స్పెషల్ డ్రైవ్
హైదరాబాదులో శనివారం అర్థరాత్రి 11.30గంటల నుంచి ఒంటిగంట వరకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ - కేబీఆర్ పార్క్ మధ్య తనిఖీలు చేపట్టి మితిమీరిన వేగంతో నడుపుతున్న 18 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వాహనదారులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం, వాహనాలు అత్యంత వేగంతో ప్రయాణిస్తుండటంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
కాగా, బైక్ రేసింగ్లను అడ్డుకున్న పోలీసులపై కొందరు యువకులు చిందులు తొక్కారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి అంతు చూస్తామని బెదిరించారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ వద్ద జరిగింది. చెక్ పోస్టు సమీపంలో బైక్ పై వేగంతో దూసుకువస్తున్న వారిని పోలీసులు ఆపారు.
దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన యువకులు వాదనకు దిగారు. బైక్ రేసులను అడ్డుకుంటారా? మా నాన్నెవరో తెలుసా? అంటూ దుర్భాషాలాడారని తెలుస్తోంది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పైన దాడికి యత్నించారని తెలుస్తోంది. అదనపు పోలీసు బలగాల సాయంతో మొత్తం 16 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, 16 బైకులు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
వీరందరినీ రాత్రంతా స్టేషన్లో ఉంచి, ఉదయాన్నే వారి తల్లిదండ్రులను పిలిపించారు. ప్రస్తుతం తల్లిదండ్రుల సమక్షంలో వీరికి కౌన్సెలింగ్ జరుగుతోంది. తొలిసారిగా దొరికిన వారికి హెచ్చరించి వదిలేస్తామని, గతంలోనే కౌన్సెలింగ్ పూర్తయిన వారిపై కేసులు పెట్టనున్నామని పోలీసులు చెప్పారు.