అమలాపురం మాజీ ఎంపీకి 6 నెలలు జైలు శిక్ష, జరిమానా
రాజమండ్రి: అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్కు 6 నెలలు జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ రాజమండ్రి మూడో అదనపు ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఆర్. కిశోర్బాబు గురువారం తీర్పు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2007 ఫిబ్రవరి 25న రాజమండ్రి మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో మాలమహానాడు అధ్యక్షులు కారెం శివాజీ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో 144 సెక్షన్ విధించారు. ఆరోజు రాత్రి 10 గంటల సమయం కొందరు వ్యక్తులు గుమిగూడి ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఆనాటి ఎంపీ హర్షకుమార్ పోలీస్ స్టేషన్కు వెళ్లి డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ సత్యనారాయణపై దౌర్జన్యంగా ప్రవర్తించడంతో పాటు, స్టేషన్లో ఉన్న వ్యక్తులను తీసుకొని పోయాడు. దీంతో ఏఎస్ఐ ఫిర్యాదుతో స్టేషన్ ఎస్ఐ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు.
విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో గురువారం రాజమండ్రి మూడో అదనపు ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఈ శిక్షను విధించారు. అనంతరం మాజీ ఎంపీ హర్షకుమార్ను అరెస్టు చేయగా బెయిల్పై విడుదలయ్యారు. జిల్లా కోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు 30 రోజులు సమయమిచ్చారు.












Click it and Unblock the Notifications