వృద్ధ నేతల స్పీచ్లతో అమరావతి కష్టం- ఎల్లుండి తాడిపత్రిలో దీక్ష చేస్తానని జేసీ ప్రకటన
అనంతపురం జిల్లా తాడిపత్రితో రాష్ట్రంలో జరుగుతున్న పలు ఘటనలపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఆయన అమరావతి ఉద్యమంతో పాటు తాడిపత్రి ఘటనలపైనా స్పందించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విధానం ఇది కాదని నేతలకు ఆయన హితవు పలికారు. దీంతో ఇప్పుడు జేసీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
అమరావతి ఉద్యమంపై మాట్లాడిన మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి.. 70 ఏళ్లు పైబడిన వారంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ వయసులో తమ స్పీచ్లతో అమరావతి ప్రజలను వారు రెచ్చగొడుతున్నారని జేసీ ఆరోపించారు. ఏడాది గడిచినా వీటితో ఏమైనా స్పందన ఉందా అని వారిని ప్రశ్నించారు. ఇంకెందుకు ఉద్యమం అన్నారు. ఇలా చేస్తే ప్రభుత్వం స్పందించదన్నారు. ప్రాణత్యాగానికి వారు సిద్ధం కావాలని జేసీ సూచించారు.

అమరావతి కోసం తాను ఆమరణ దీక్ష చేస్తానని, వృద్ధ నాయకులు మాటలు కట్టిబెట్టి ఉద్యమానికి రావాలని జేసీ దివాకర్రెడ్డి వారిని ఆహ్వానించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 4న తాడిపత్రితో తన తమ్ముడు ప్రభాకర్రెడ్డితో కలిసి తాను ఆమరణ దీక్ష చేస్తామన్నారు. 144 సెక్షన్, 30 యాక్ట్, కోవిడ్ యాక్ట్ అమల్లో ఉన్నా దీక్ష ఉంటుందన్నారు. అరెస్టులు చేస్తారేమో చేసుకోండని జేసీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తనతో పాటు 70 ఏళ్ల వారు కలిసి రావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని, అందుకే తాను వీటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నట్లు జేసీ వెల్లడించారు.












Click it and Unblock the Notifications