చంద్రబాబు ఇస్తేనే జగన్ ? టీడీపీకి జరిగేదిదే..! ఈసారి పోటీ చేయట్లేదు-రాయపాటి కామెంట్స్..
గుంటూరు : ఏపీలో సీనియర్ రాజకీయ వేత్తల్లో ఒకరైన గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తాజా రాజకీయాలపై ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన పోటీతో మొదలుపెట్టి, టీడీపీ-జనసేన పొత్తు, వచ్చే ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. తనకు బదులు కుమారుడికి టికెట్ అడుగుతున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు సీటు ఎక్కడ ఇస్తే అక్కడ తన కుమారుడు రాయపాటి శ్రీనివాస్ పోటీ చేస్తారని వెల్లడించారు. అలాగే గుంటూరు జిల్లాలోని తాడికొండ సీటు తోకల రాజవర్దన్ రావుకేనని రాయపాటి వ్యాఖ్యానించారు. ఆయన తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తారని కూడా జోస్యం చెప్పారు.
మరోవైపు టీడీపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పొత్తు ఉంటే మంచిదేనని రాయపాటి తెలిపారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం మంచిది కాదని జగన్ సర్కార్ కు ఆయన హితవు పలికారు. ఆనాడు చంద్రబాబు అనుమతి ఇస్తేనే కదా జగన్ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. అలాగే లోకేష్ పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వాలని రాయపాటి ఏపీ ప్రభుత్వానికి సూచించారు.