వైసీపీలోకి మరో టిడిపి నేత?:బాలనేనితో పీడీసీసీబీ మాజీ చైర్మన్ ఈదర మోహన్ మంతనాలు!
ప్రకాశం:ప్రకాశం జిల్లాలో టిడిపికి మరో ఎదురుదెబ్బ తగలటం ఖాయంగా కనిపిస్తోంది...ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (పీడీసీసీబీ) మాజీ చైర్మన్ ఈదర మోహన్బాబు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఈదర మోహన్ చేరికకు వైసిపి అధినేత జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత టీడీపీకి దూరంగా ఉంటున్న మోహన్ ఒంగోలు పట్టణంలోని రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ క్రమంలో ఈయన ఒంగోలు లోక్సభ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ అయి చర్చలు జరిపినట్లు తెలిసింది.
గతంలో కాంగ్రెస్లో ఉండి ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ అయిన ఈదర మోహన్ బాబు గత ఎన్నికలకు టీడీపీ కోసం పనిచేశారు. ఆ ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన దామచర్ల జనార్దన్కు మద్దతుగా పని చేశారు. అనంతరం చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్తో కలిసి సిఎం చంద్రబాబు సమక్షంలో అధికారికంగా టిడిపిలో చేరారు. అయితే ఆ తరువాత కొంతకాలం క్రిందట పీడీసీసీబీలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో వాటి పరిణామాల నేపథ్యంలో ఈదర మోహన్ తన పదవికి రాజీనామా చేశారు.
టీడీపీకే చెందిన కొంతమంది నాయకుల ప్రోద్భలం తోనే బ్యాంక్ డైరెక్టర్లు తనపై తిరుగుబాటు చేశారని మనస్థాపం చెందిన ఆయన అదే విషయాన్ని బహిరంగంగా ఆరోపించి అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవలికాలంలో బ్యాంక్ పాలకమండలి రద్దు, బ్యాంక్ చైర్మన్గా తాను ఉన్న సమయంలో లావాదేవీలు తదిదర అంశాలపై దర్యాప్తు జరుపుతుండటం తనను ఇబ్బంది పెట్టేందుకేనని ఆయన మరింత మనస్థాపానికి గురయ్యారు.
దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించిన ఆయన వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీనివెనుక ఈదర్ మోహన్ తన రాజకీయ గురువుగా భావించే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సూచన కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈయన తొలుత బీజేపీలో చేరాలని అనుకున్నా ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసిపిలో చేరాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు, ఆ క్రమంలోనే బాలినేనితో మంతనాలు జరిపినట్లు తెలిసింది. ఇందుకు వైసీపీ ఏర్పాటుకు ముందు నుంచే కాంగ్రెస్లో ఉండగానే బాలినేనితో ఈయనకు ఉన్న సాన్నిహిత్యం కూడా ఈయన వైసిపి వైపు మొగ్గు చూసేందుకు కారణమైందంటున్నారు.