మంత్రి అనిల్ కనిపించట్లేదని దేవినేని ప్రెస్ మీట్-వెంటనే ప్రత్యక్షం
ఏపీలో నేతల రాజకీయాలు ఎలా ఉంటాయనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ జరిగిన ఓ ఘటన. ఈ మధ్య కాలంలో ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు కంటే హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. దీనిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మంత్రి అనిల్ అదృశ్యమయ్యారంటూ విపక్షాలు విమర్శలు కూడా చేస్తున్నాయి.
ఇదే క్రమంలో ఇవాళ మంత్రి అనిల్ కనిపించడం లేదని ఆరోపిస్తూ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో ఆయన మంత్రి అనిల్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈనెల 18న నందిగామలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం చేపుట్టనున్నట్లు దేవినేని ఉమ తెలిపారు. ఇరిగేషన్ శాఖ 28 నెలలో ఏం ఖర్చు పెట్టిందో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడడం లేదు, కనబడడం లేదన్నారు. ఇరిగేషన్ శాఖ గురించి ఏమి తెలుసని వ్యవసాయ మంత్రి కన్నబాబు మాట్లాడుతున్నారని దేవినేని ప్రశ్నించారు.

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కనిపించడం లేదని, వినిపించడం లేదని దేవినేని ఉమ ఆరోపించిన సమయంలోనే విచిత్రంగా ఆయన నెల్లూరులో దర్శనమిచ్చారు. నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీలో ఉన్న జలవనరుల మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ జిల్లాలోని ఇరిగేషన్ ఎస్.ఈ., తెలుగుగంగ ఎస్.ఈ., సోమశిల ఎస్.ఈ., ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లాలోని ప్రాజెక్ట్ ల స్థితిగతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో పెన్నా బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులను పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో అదే సమయంలో ప్రెస్ మీట్ పెట్టిన దేవినేనిపై వైసీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు.

వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమ... తరచుగా ప్రస్తుత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను టార్గెట్ చేస్తున్నారు. ఉమ విమర్శలపై పలుమార్లు స్పందించిన అనిల్.. ఈ మధ్య మాట్లాడటం లేదు. దీంతో ఉమ మరోసారి అనిల్ ను టార్గెట్ చేశారు. కానీ ఆయన నెల్లూరులోనే ఉన్నారన్న విషయం మాత్రం మర్చిపోయారు. దీంతో ప్రెస్ మీట్లో అనిల్ కనిపించడం లేదని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications