ఆ పార్టీలకు డబుల్ బొనాంజా: కేబినెట్లోకి మళ్లీ వస్తాం: మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు: రాజకీయ ప్రత్యర్థులపై మాజీ మంత్రుల మాటల దాడి మొదలైనట్టే. కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే రాజకీయాలపై దృష్టి సారించారు ఒకరిద్దరు మాజీలు. మాజీమంత్రి కొడాలి నాని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీపై ఘాటు విమర్శలు సంధించారు. ఇప్పుడీ డ్యూటీని మరో మాజీమంత్రి అనిల్ కుమార్ తీసుకున్నారు. ఈ రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకుని పదునైన మాటలతో విరుచుకుపడ్డారాయన.
పొత్తుల కోసం ఎదురుచూసే పవన్ కల్యాణ్..
పవన్ కల్యాణ్ను బిచ్చం నాయక్గా అభివర్ణించారు. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకుని మరొకరిని ముఖ్యమంత్రిని చేయాలని పవన్ కల్యాణ్ తపిస్తున్నాడని విమర్శించారు. సొంతంగా 175 స్థానాల్లో పోటీ చేసే సామర్థ్యం ఆయనకు లేదని ధ్వజమెత్తారు. ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుని వారు ఇచ్చే 30-40 సీట్ల కోసం వెంపర్లాడే పవన్ కల్యాణ్.. భీమ్లా నాయక్ కాదని.. బిచ్చం నాయక్ అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ నిజంగా 175 స్థానాల్లో పోటీ చేస్తే తన మాటలను వెనక్కి తీసుకుంటానని స్పష్టం చేశారు.
తానే ముఖ్యమంత్రినని ప్రకటించుకోగలరా?
ఈ ఉదయం అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్కు 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తే ఆయనే వచ్చి తమతో పొత్తు పెట్టుకుంటారని తెలుగుదేశం పార్టీ నేతలు బాహటంగా చెబుతున్నారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ సొంతంగా పోటీ చేసి, 2024లో తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని బహిరంగంగా ప్రకటించుకున్నప్పుడు ఆయన భీమ్లా నాయక్ అని నమ్ముతానని అన్నారు. టీడీపీ బిచ్చంలాగా వేసే సీట్ల కోసం ఎదురు చూసే వాళ్లని బిచ్చం నాయక్ అనే అంటారని ఎద్దేవా చేశారు.
ఇంకా స్వేచ్ఛగా పని చేస్తాం..
2024 సార్వత్రిక ఎన్నికల్లో తమకు ప్రధాన పోటీదారు తెలుగుదేశమే తప్ప సైడ్ క్యారెక్టర్లాంటి పవన్ కల్యాణ్ కాదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాము ఎప్పటికీ సైనికులమేనని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల యుద్ధంలో సైనికుల్లా తమను దింపారని చెప్పారు. మంత్రి పదవులను తొలగించిన తరువాత తాను గానీ, పేర్ని నాని గానీ, కొడాలి నాని గానీ.. ఇంకా స్వేచ్ఛగా తమ గళాన్ని వినిపించగలమని తేల్చి చెప్పారు.
2024 తరువాత మళ్లీ కేబినెట్లోకి..
తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలకు ఇక డబుల్ బొనాంజా ఉంటుందని హెచ్చరించారు. ఇకపై తమ ఎదురుదాడి తీవ్రత మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. రెండు సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడాలని వైఎస్ జగన్ తమను సూచించారని, ఆయన చెప్పినట్టే పార్టీపరంగా ఎన్నికల బరిలోకి దిగుతామని అన్నారు. 2024లో మళ్లీ వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని, కేబినెట్లో తిరిగి చోటు దక్కించుకుంటామనీ చెప్పారు.
పార్టీని గెలిపించే బాధ్యత తమపై..
పార్టీని ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యతను తమ నాయకుడు అప్పగించారని, దాన్ని గర్వంగా భావిస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. పార్టీనే లేకపోతే పదవులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. పార్టీ ఉండటం వల్లే తాను ఎమ్మెల్యే కాగలిగానని, మంత్రిగా పని చేయగలిగానని అన్నారు. పార్టీ బాగుంటేనే తాము బాగుంటామని వ్యాఖ్యానించారు. ఈ రెండు సంవత్సరాల పాటు తాము పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తామని పేర్కొన్నారు. తనకు ఇంత గొప్ప గౌరవం దక్కిందంటే అది వైసీపీ వల్లేనని చెప్పారు.