టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ రావు
విజయవాడ: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ పార్లమెంటు సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో మోపిదేవి, మస్తాన్ రావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా మోపిదేవి, మస్తాన్ రావుకు టీడీపీ కండువాలు కప్పి చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలకు టీడీపీ అధినేత తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఆగస్టులో ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు తమ పదవులకు రాజీనామా చేయగా.. వారి రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ఆమోదించిన విషయం తెలిసిందే. అందకుముందే వీరిద్దరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఆ సమయంలోనే తాను టీడీపీలో చేరతానంటూ మోపిదేవి వెంకటరమణ ప్రకటించగా.. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానన్న బీద మస్తాన్ రావు కూడా తాజా టీడీపీ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు రాజ్యసభ సభ్యులు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణతోపాటు ఆర్ కృష్ణయ్య సైతం రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్య బీసీ రిజర్వేషన్ల కోసం తన పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.
కాగా, ఇప్పటికే పలువురు వైయస్సార్సీపీ నేతలు టీడీపీలో చేరగా.. మరికొందరు జనసేన, బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి కావడంతో ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వలసలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications