Yarlagadda Venkatrao : టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు-లోకేష్ సమక్షంలో తీర్ధం ..!
గన్నవరం నియోజకవర్గంలో తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు ఇవాళ విపక్ష టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. గన్నవరంలో వైసీపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ ఎప్పుడో ఖరారు చేసిన నేపథ్యంలో తనకు టికెట్ కావాలని కోరుతూ చివరి ప్రయత్నాలు చేసిన యార్లగడ్డ.. అవి కాస్తా సఫలం కాకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన యార్లగడ్డ ఇవాళ లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు.
గన్నవరం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని ఇప్పటికే ప్రకటించిన యార్లగడ్డ వెంకట్రావు.. నిన్న హైదరాబాద్ లో చంద్రబాబును కలిసి ఆ మేరకు అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే గన్నవరంలో ఇన్ ఛార్జ్ లేని టీడీపీ యార్లగడ్డను పార్టీలోకి తీసుకునేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు ఇవాళ కృష్ణాజిల్లాలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో పరిధిలోకి వచ్చే నిడమానూరులో ఇవాళ పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ ను ఆయన క్యాంపు సైటు వద్దకు వెళ్లి కలిసిన యార్లగడ్డ పార్టీలో చేరిపోయారు. దీంతో పాటు గన్నవరం నియోజకవర్గంలో జరిగే పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. త్వరలో యార్లగడ్డను టీడీపీ అధికారికంగా గన్నవరం అసెంబ్లీ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీపై టీడీపీ అభ్యర్ధిగా యార్లగడ్డ పోటీ చేయడం ఖాయమైంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన వల్లభనేని వంశీపై వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. ఈసారి టీడీపీ నుంచి బరిలోకి దిగుతుంటే.. వంశీ వైసీపీ నుంచి బరిలోకి దిగబోతుండటం ఆసక్తికరంగా మారింది. అయితే గత ఎన్నికల్లో కేవలం 700 ఓట్ల తేడాతో ఓడిన యార్లగడ్డకు స్ధానికంగా సొంత సామాజిక వర్గం బలంతో పాటు అనుచర గణం కూడా భారీగా ఉండటం కలిసి వస్తోంది. అలాగే గత ఎన్నికల సమయంలో అమెరికా నుంచి వచ్చి వెంటనే ఎన్నికల బరిలోకి దిగి 700 ఓట్లతో ఓడిన యార్లగడ్డ.. ఆ తర్వాత నియోజకవర్గంలో బలం పెంచుకోవడం టీడీపీకి కలిసి రానుంది.












Click it and Unblock the Notifications