నో ముందస్తు- 2024లోనే ఎన్నికలకు -వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని కామెంట్స్
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధం తారాస్దాయికి చేరుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై చర్చ కూడా అంతే స్పీడుగా సాగుతోంది. వైసీపీ ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతోందని ఇప్పటికే విపక్ష నేత చంద్రబాబు పలుమార్లువ్యాఖ్యానించగా... వైసీపీ నేత సజ్జల కూడా ఒకట్రెండు ఏళ్లలో ఎన్నికలకు వెళ్తామని సంకేతాలు ఇచ్చేశారు. దీంతో ముందస్తు రాగాలు వినిపిస్తున్నాయి.
ఏపీలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న చర్చపై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. ఏఫీలో ముందస్తు ఎన్నికలు జరగబోవని, 2024లోనే వైసీపీ ఎన్నికలకు వెళ్తుందని ఆయన తేల్చిచెప్పారు. గన్నవరంలో వైసీపీ మంత్రుల బస్సు యాత్ర చేరుకున్న సందర్భంగా అక్కడికి వచ్చిన పేర్నినాని వైసీపీ మంత్రుల బస్సు యాత్రపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మంత్రుల బస్సు యాత్ర టీడీపీ మహానాడుకు పోటీగా పెట్టింది కాదని ఆయన వెల్లడించారు. అసలు మహానాడును నిర్వహించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.
గతంలో వైసీపీ అధినేతగా జగన్ చేపట్టిన పాదయాత్రకు ఎలా జనం వచ్చారో ఇప్పుడు మంత్రుల బస్సు యాత్రకు కూడా అదే స్ధాయిలో జనం నుంచి స్పందన ఉందని పేర్నినాని తెలిపారు. గడప గడపకూ వైసీపీపై మాట్లాడుతూ అర్హత లేకపోయినా పథకాలు రాలేదని కొందరు ప్రశ్శిస్తున్నారని అన్నారు. గతంలో జగన్ కు 50 శాతం ఓట్లు వచ్చాయని, స్ధానిక ఎన్నికల్లో వైసీపీకి 60 శాతం ఓట్లు వచ్చాయని, ఆ మిగిలిన 40 శాతం మందే ఇప్పుడు తమను పథకాలు రాలేదని ప్రశ్నిస్తున్నారని, ఇదంతా వ్యతిరేకత కాదని పేర్నినాని వివరించారు.