వల్లభనేని వంశీకి ఏదైనా జరిగితే.. రంగా సీన్ రిపీట్..! పేర్ని నాని వార్నింగ్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రస్తుతం కూటమి సర్కార్ వరుస కేసులతో టార్గెట్ చేస్తోంది. అంతే కాదు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నా కనీసం ఓఆర్ఎస్ కూడా ఇవ్వకుండా పోలీసు స్టేషన్లకు తిప్పుతూ వేధిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వంశీని ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించిన వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే ప్రాణాలు పోతున్నా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చే పరిస్ధితి లేదని పేర్ని నాని ఆరోపించారు. ఇంత దిక్కుమాలిన ఆస్పత్రిలో వైద్యం అందిస్తారా అని ప్రశ్నించారు. గతంలో ఎన్టీఆర్ పతనానికి రంగా మరణం కారణమైందని, ఇప్పుడు వంశీకి ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వం పతనం అవుతుందని హెచ్చరించారు. గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడుకు పైల్స్ ఉందని రమేశ్ ఆస్పత్రిలో వైద్యం అడిగారని, ఇప్పుడు వంశీని మాత్రం ప్రభుత్వ ఆస్పత్రికి పంపి ఇబ్బందులు పెడుతున్నారన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వంశీ దొంగ పట్టాలు పంచారన్న ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేశారని, అప్పటి ప్రభుత్వానికి తప్పుకాదా అని అడిగారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు, ఆయన కుమారుడు ముద్దాయిలు కారా అని అడిగారు. టీడీపీ జెండా మోస్తే ఏ పాపాలు చేసినా ఫర్వాలేదని, జెండా మోయకపోతే మాత్రం ఇలా వేధిస్తారా అని పేర్ని ప్రశ్నించారు. ఎవరో మానసిక ఆనందం కోసం పోలీసులు, వైద్యులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్ని ఆరోపించారు. ఇలాంటి వాళ్లు అంతకంతా అనుభవిస్తారన్నారు.












Click it and Unblock the Notifications