జగన్ కంటే పవన్ బెటర్- జనసేనలో మరో మాజీ ఎమ్మెల్యే
Pawan Kalyan: ఇటీవలే జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. అనేక జిల్లాల్లో ఆ పార్టీని ఖాళీ అవుతోంది. బడా నాయకులు సైతం గుడ్బై చెబుతున్నారు. మాజీ మంత్రులు-ఎంపీలు- ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలు వరుస కట్టి బయటికెళ్తోన్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ శాసన సభ్యుడు పెండెం దొరబాబు.. పార్టీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. అంతకుముందు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ విప్ సామినేని ఉదయభాను.. భారీ షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరడానికి వారిద్దరూ రంగం సిద్ధం చేసుకున్నారు. బాలినేని ఇదివరకే ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తోనూ భేటీ అయ్యారు.
ఈ క్రమంలో మరో మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య.. జనసేనలో చేరడం ఖాయమైంది. దీనిపై ఇప్పటికే పవన్ కల్యాణ్తో సంప్రదింపులు పూర్తయ్యాయని తెలుస్తోంది. మంగళగిరిలో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ చేతుల మీదుగా కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

మొన్నటి ఎన్నికల్లో గుంటూరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు రోశయ్య. తెలుగుదేశం పార్టీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 3.50 లక్షలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం చవి చూశారు. అంతకుముందు 2019లో పొన్నూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారాయన.
తాజాగా ఓటమి తరువాత వైఎస్ఆర్సీపీకి గుడ్బై చెప్పారు. ఇక జనసేనలో కండువా కప్పుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. జిల్లాకే చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్తో ఇటీవలే భేటీ అయ్యారని, చేరికకు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications