ఆక్వా రైతుల బాధలు పట్టని చంద్రబాబు ప్రభుత్వం
అభివృద్ధి పరంగా ఆక్వారంగం దూసుకెళ్తున్నా సాగు చేయడానికి కీలకమైన నాణ్యమైన రొయ్యపిల్లలను పొందలేక రైతులు నష్టాలపాలవుతున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయగోదావరి, విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో చేపల చెరువులు విస్తరించాయి. రాష్ట్రానికి ఆక్వారంగం ద్వారా రూ.65 వేల కోట్లు ఆదాయం లభిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా చెరువులు విస్తరించి ఉన్నాయి. ఆక్వాపై రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది రైతులు, కూలీలు ఆధారపడి ఉన్నారు. రాష్ట్రంలో 380 హేచరీలు పనిచేస్తుండగా, సుమారు 160 అనుమతి లేనివి నిర్వహిస్తున్నారు.
అభివృద్ధి పరంగా ఆక్వారంగం దూసుకెళ్తున్నా సాగు చేయడానికి కీలకమైన నాణ్యమైన రొయ్యపిల్లలను పొందలేక రైతులు నష్టాలపాలవుతున్నారు. రొయ్యపిల్లలను వృద్ధిచేసి.. విక్రయించే హేచరీలు పుట్టగొడుగుల్లా పెరిగి, నాణ్యతకు నీళ్లు వదలడం వల్ల సరైన సీడ్ దొరక్క అనతికాలంలోనే సాగును ముగించాల్సిన దుస్థితిని తరచూ ఎదుర్కొంటున్నారు.
రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో సర్కార్ వైఫల్యం
ఇలాంటి తరుణంలో కొందరు ఆక్వారైతులు సొంత హేచరీలను నిర్మించుకుని, నాణ్యమైన రొయ్యపిల్లలను తామే వృద్ధిచేసుకుని, స్వీయ అవసరాలు మిగిలినదంతా సహచర రైతులకు అందించాలని సంకల్పించారు. నిబంధనల మేరకు నిర్మించినా ఈ హేచరీల నుంచి సీడ్ ఉత్పత్తికి అనుమతులు లభించటం లేదు. ఇలాంటవి ఉభయ గోదావరి జిల్లాల్లో 11 వరకు ఉన్నాయి. వీటిని ఏడాది కిందట కేంద్ర కమిటీ తనిఖీ చేసి సీడ్ ఉత్పత్తికి తలూపినా రాష్ట్రస్థాయిలో మాత్రం అనుమతులు ఇవ్వకపోవడం విచిత్రంగా కనిపిస్తున్నది.
ప్రైవేట్ హేచరీల యాజమాన్యాలు మత్స్యశాఖ అధికారులకు ముడుపులు ముట్టజెప్పడం వల్లే ఇన్లాండ్ హేచరీలకు అనుమతులు ఇవ్వడం లేదని ఆక్వారైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర కమిటీ పరిశీలించాక కూడా అనుమతులకు జాప్యం ఎందుకని, ఒక్కో హేచరీ నిర్మాణానికి రూ.4కోట్లు వంతున వెచ్చించినా ప్రభుత్వ సహకారం కరవైందని వారు వాపోతున్నారు.
రైతుల ప్రయోజనాలకు ప్రైవేట్ హేచరీలు అడ్డంకి
రైతుకు అవసరమైన, నాణ్యమైన రొయ్యపిల్లలనే ఉత్పత్తి చేసుకుని, మిగిలినదంతా తోటి రైతులకు పంపిణీ చేయవచ్చునని, దీనివల్ల దీనివల్ల కాలుష్యం తగ్గుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సొంత హేచరీలతో వ్యయప్రయాసలను నియంత్రించుకోవచ్చు. ఉదాహరణకు పశ్చిమగోదావరి జిల్లా రైతులు కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల నుంచి సీడ్ తేవడం వల్ల అధిక ధర పెట్టాల్సి వస్తున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. సుదీర్ఘదూరం రవాణాలో కొన్ని రొయ్యపిల్లలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని కమిటీ క్షేత్రస్థాయిలో తనిఖీచేసి ఇన్లాండ్ హేచరీలు బాగానే ఉన్నట్లు నిర్ధారించింది. సంబంధిత ఫైల్ రాష్ట్రస్థాయి అధికారుల దగ్గరకు వెళ్లింది. అక్కడి నుంచి అనుమతులు రావాలని తూర్పు గోదావరి జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకురాలు డాక్టర్ ఎస్ అంజలి తెలిపారు.
అక్వా చట్టంతోనే రైతులకు లబ్ది
రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం ఆక్వా చట్టాన్ని తేవాల్సి ఉన్నదని చెప్తున్నారు. చక్కని ఆదాయం వస్తున్నా రాష్ట్రప్రభుత్వం ఆక్వాలో ఆ స్థాయి సంస్కరణలు తేవడం లేదని, ఇన్లాండ్ హేచరీలకు అత్యవసరంగా అనుమతులివ్వాలని రైతులు కోరుతున్నారు. రూ. కోట్లు పెట్టి ఇన్లాండ్ హేచరీలను నిర్మించామని, కేంద్రకమిటీ వచ్చి తనిఖీలు చేసి ధ్రువీకరించినా రాష్ట్రస్థాయి కమిటీ పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. తమ సమస్యను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రికీ సమస్యను విన్నవించామని తెలిపారు.