ఫిబ్రవరి నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు: చంద్రబాబు
ఏలూరు: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆయన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాలని ఆయన అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎన్టీఆర్ వైద్య సేవల పథకాన్ని కూడా శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు అన్ని రకాల వైద్యసేవలను పొందాలన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ఏ వైద్య పరీక్ష అయినా ఉచితంగా చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
పిల్లలు, బాలింతల కోసం ప్రత్యేక హెల్ప్లైన్(102) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పథకంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలన్నింటినీ ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్టీఆర్ వైద్య సేవల కోసం రూ.900 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరికరాల కొరత లేకుండా చేస్తామన్నారు.
పేదవారి ఆరోగ్యం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రులు వైద్య సేవలు అందించే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పేదలకు సక్రమంగా ఉపయోగపడలేదని చెప్పారు.